ఆస్కార్ బరిలో 'శ్యామ్ సింగ రాయ్'!
on Aug 17, 2022
త్వరలో ప్రకటించనున్న 'సైమా' అవార్డుల్లో 2021కి గాను అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన తెలుగు సినిమాల్లో 'పుష్ప', 'అఖండ', 'జాతిరత్నాలు', 'ఉప్పెన' టాప్ లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అదే ఏడాది విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందటంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం టాప్ లిస్టులో లేకపోవడంపై హీరో నాని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల విషయంలో నాని సినిమాలకు అన్యాయం జరుగుతుందంటూ వారు ట్విట్టర్ వేదికగా తమ ఆవేదన పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారికో శుభవార్త. ఆస్కార్ నామినేషన్స్ కోసం ఇండియా నుంచి మూడు విభాగాల్లో 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని పంపించారు.
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించిన ఈ పీరియాడిక్ ఫిల్మ్ డిసెంబర్ 24, 2021న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు కట్టి పడేశాయి. ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం తాజాగా మరో ఘనత సాధించింది. క్లాసికల్ కల్చరల్ డాన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పీరియాడిక్ ఫిల్మ్ విభాగాల్లో భారత్ తరఫున ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కోసం పంపించడం జరిగింది. మరి ఆస్కార్ బరిలో 'శ్యామ్ సింగ రాయ్' నిలుస్తుందేమో చూడాలి.