టాలీవుడ్ నుంచి మరో భారీ పాన్ ఇండియా ఫిల్మ్!
on Aug 17, 2022
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి పాన్ ఇండియా సినిమాలతో రైటర్ గా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ మరో భారీ పాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టారు. 'ఆకాశవాణి' ఫేమ్ అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.
1882లో బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ నవల 'ఆనంద్ మఠ్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి '1770' అనే టైటిల్ ని ఖరారు చేశారు. శైలేంద్ర కుమార్, సూరజ్ శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. చేతిలో ఖడ్గం పట్టుకొని బ్రిటిష్ సైన్యంతో పోరాడుతున్న వీరుడి పోస్టర్ ఆకట్టుకుంటోంది. అలాగే ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో తెలిపారు.
భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో నటించనున్నాడని తెలుస్తోంది.