శ్రియ సినీ ప్రస్థానానికి 20 ఏళ్ళు!
on Nov 30, 2021
రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, విజయ్, విక్రమ్, రవితేజ.. ఇలా దక్షిణాదిలోని దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ జోడీకట్టిన కథానాయికగా తన తరంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రియ. అంతేకాదు.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఆంగ్లం వంటి విభిన్న భాషల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లోనూ ఆకట్టుకున్న వైనం తన సొంతం. అదే విధంగా.. అటు గ్లామర్ తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్ తోనూ అలరించిన అతి తక్కువ మంది కథానాయికల్లో ఒకరిగానూ గుర్తింపు దక్కించుకుంది ఈ ఉత్తరాది సోయగం. అలాంటి శ్రియ.. వెండితెరపై మెరిసి నేటికి (నవంబర్ 30) సరిగ్గా ఇరవై ఏళ్ళు.
నేటి ప్రముఖ దర్శకుల్లో ఒకరైన విక్రమ్ కె. కుమార్ మరో దర్శకుడు రాజ్ కుమార్ తో కలిసి సంయుక్తంగా రూపొందించిన `ఇష్టం` (2001)తో శ్రియ సినీ ప్రస్థానం మొదలైంది. దిగ్గజ నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాలో నేహా అనే యువతి పాత్రలో తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది శ్రియ. ఆ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా.. నాగ్ కి జోడీగా నటించిన `సంతోషం` (2002)తో తొలి విజయాన్ని అందుకుని ఆపై వరుస సినిమాలతో, విజయాలతో స్టార్ హీరోయిన్ గా రాణించింది. 20 ఏళ్ళ పాటు తన గ్లామర్ తో వెండితెరపై వెలుగులు పంచుతూ మురిపిస్తూ వస్తోంది. కాగా, త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ `గమనం`, `ఆర్ ఆర్ ఆర్` వంటి పాన్ - ఇండియా మూవీస్ లో అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో కనువిందు చేయనుంది.
మరి.. రెండు దశాబ్దాల పాటు వన్నె తరగని అందంతో ఫిదా చేస్తూ వస్తున్న శ్రియ.. మున్ముందు కూడా ఇదే శైలిలో తన అందం, అభినయంతో మురిపిస్తుందేమో చూడాలి.