
ఎన్నో గొప్ప పాటలకు తన కలంతో అద్భతమైన సాహిత్యాన్ని అందించిన ప్రఖ్యాత గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈరోజు (నవంబర్ 30) కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఈ నెల 24న కుటుంబసభ్యులు సికిందరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. అప్పట్నుంచీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.
సీతారామశాస్త్రి ఆకస్మిక మృతితో తెలుగు చిత్రసీమ యావత్తూ దిగ్భ్రాంతికి లోనైంది. రెండు రోజుల క్రితమే సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ కొవిడ్తో బాధపడుతూ మృతిచెందగా, ఇప్పుడు సీతారామశాస్త్రి కన్నుమూయడంతో టాలీవుడ్ విషాద సాగరంలో మునిగిపోయింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అనుకున్నారే కానీ, క్రిటికల్ కండిషన్లో ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు.
1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సీతారామశాస్త్రి జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎం. చదువుతూ కె. విశ్వనాథ్ సినిమా 'సిరివెన్నెల' (1986)తో గేయరచయితగా పరిచయమై, తొలిచిత్రంతోటే పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు.





.webp)
