కొవిడ్తో సీనియర్ కమెడియన్ కన్నుమూత
on May 6, 2021
సీనియర్ కమెడియన్, పలు తమిళ సినిమాల్లో నటించిన పాండు గురువారం చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిన ఆయన హాస్పిటల్ పాలై, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
1981లో 'కరైయేల్లమ్ షెన్బాగపూ; సినిమాతో నటుడిగా పరిచయమైన పాండు 550కి పైగా సినిమాల్లో కమెడియన్గా ప్రేక్షకుల్ని నవ్వించారు. వాటిలో కాదల్ కొట్టై, బద్రి, సిటిజన్, పోకిరి, సింగమ్, పమ్మల్ కె. సమాధానమ్, కాంచన 2 తదితర చిత్రాలున్నాయి.
చిత్రకారుడిగా కూడా పాండు ఫేమస్. ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగమ్ (ఏఐఏడీఎంకే) పార్టీ జెండాను, దాని రెండు ఆకుల చిహ్నాన్నీ డిజైన్ చేసింది ఆయనే.
'కేపిటల్ లెటర్స్' అనే కంపెనీని కూడా పాండు నడుపుతూ వచ్చారు. తమిళ చిత్రసీమలోని పలువురు సెలబ్రిటీ ఇళ్లకు, ఆఫీసులకు ఆ కంపెనీ కింద ఆయన నేమ్ బోర్డులు డిజైన్ చేశారు. పాండు మృతికి పలువురు కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
Also Read