రేపు ఫిల్మ్చాంబర్లో అభిమానుల సందర్శనార్థం సీతారామశాస్త్రి భౌతికకాయం!
on Nov 30, 2021
న్యుమోనియాతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం సికిందరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచిన లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి రేపు ఫిల్మ్నగర్లోని 'మహాప్రస్థానం'లో అంత్యక్రియలు జరగనున్నాయి. ముందుగా ఆయన పార్ధివదేహాన్ని అభిమానులు, సినీ కళాకారుల సందర్శనార్థం ఫిల్మ్చాంబర్ ప్రాంగణంలో ఉంచనున్నారు. ఈ రోజు రాత్రి కిమ్స్ హాస్పిటల్లోనే ఆయన పార్ధివదేహాన్ని ఉంచుతామనీ, రేపు ఉదయం 7 గంటలకు ఫిల్మాచాంబర్ ప్రాంగణంకు తరలిస్తామనీ కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా సీతారామశాస్త్రి మృతివార్త తెలియగానే ఆయనతో అనుబంధం ఉన్న అనేకమంది సినీ సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఇకలేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనీ, గతేడాది గానగంధర్వుడిని కోల్పోతే, ఇప్పుడు గొప్ప రచయితను కోల్పోయామని విలపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, :నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా ... will miss you FOREVER !" అని ఒక ట్వీట్లోనూ, "'సిరివెన్నెల' మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు" అని మరో ట్వీట్లోనూ నివాళి అర్పించారు. వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, "చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలి" అనే నోట్ను పోస్ట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి." అని రాసుకొచ్చాడు.
Also Read