'గోవిందుడు అందరి వాడేలే'లో తాత క్యారెక్టర్ను తిరస్కరించిన సత్యరాజ్!
on Jun 14, 2021
రామ్చరణ్ హీరోగా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలోని తాత క్యారెక్టర్పై ఉన్న కాంట్రవర్సీ చాలామందికి తెలుసు. మొదట బాలరాజు అనే ఆ క్యారెక్టర్ను తమిళ సీనియర్ యాక్టర్ రాజ్కిరణ్ చేయడం, కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆయనను చెప్పా పెట్టాకుండా తీసేసి, ప్రకాశ్రాజ్తో ఆ పాత్రను చేయించడం వివాదాన్ని సృష్టించింది. నిజానికి ఆ తాత పాత్రకు ఫస్ట్ చాయిస్ రాజ్కిరణ్ కాదు, మరో తమిళ స్టార్ యాక్టర్ సత్యరాజ్. అవును. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ స్వయంగా వెల్లడించారు.
"ఆ క్యారెక్టర్కు మొదట సత్యరాజ్ను అనుకున్నాం. ఆయన 'బాహుబలి' సెట్లో ఉంటే, వెళ్లి కలిశాను. కథ విని, 'కథ చాలా బాగుంది సార్. కానీ నాకు ఇటీవలే ఫాదర్గా ప్రమోషన్ (సినిమాల్లో) వచ్చింది. మీరు ఒకేసారి గ్రాండ్ఫాదర్ ప్రమోషన్ ఇస్తే ఎలా సార్. హీరో బాబాయ్ క్యారెక్టర్ ఉంది కదా.. అది చాలా బాగుంది. అది చేస్తాను' అన్నారు. 'దానికి మీరు సరిపోరు సార్' అని చెప్పాను. దాని తర్వాత చాలామందిని అనుకున్నాం." అని ఆయన వెల్లడించారు. అప్పుడు తాను, ప్రకాశ్రాజ్ సరిగా మాట్లాడుకోవటం లేదనీ, అందుకే ఆయన పేరు ప్రస్తావనకు రాలేదనీ, అందుకే రాజ్కిరణ్ను తీసుకున్నామనీ కృష్ణవంశీ చెప్పారు.
ఏదేమైతేనేం.. చివరకు రాజ్కిరణ్ను తొలగించి, ప్రకాశ్రాజ్ చేతే ఆ పాత్రను చేయించారు. సత్యరాజ్ చేయడానికి ఇష్టపడ్డ హీరో బాబాయ్ బంగారి పాత్రను శ్రీకాంత్ చేశారు. లేనట్లయితే తాత పాత్ర కానీ, శ్రీకాంత్ చేసిన పాత్ర కానీ సత్యరాజ్ చేసి ఉండాల్సింది. 'గోవిందుడు అందరి వాడేలే' (2014) తర్వాత విడుదలైన 'బాహుబలి' (2014) మూవీలో చేసిన కట్టప్ప పాత్రతో సత్యరాజ్ దేశవ్యాప్తంగా ఇమేజ్ సంపాదించారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో రామ్చరణ్కు తాతగా నటించడానికి ఇష్టపడని సత్యరాజ్, ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' చిత్రంలో సాయిధరమ్ తేజ్కు తాతగా నటించారు.
Also Read