ఆర్జీవీ రాజకీయ 'వ్యూహం'
on Oct 27, 2022

చాలా కాలంగా హిట్ రుచి ఎరుగని దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా 'వ్యూహం' అనే సినిమాని ప్రకటించారు. అది బయోపిక్ కన్నా లోతైన రియల్పిక్ అని చెప్పుకున్నారు. గతంలో ఆయనతోటే 'వంగవీటి' మూవీని నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాత. ఈ విషయాన్ని వరుస ట్వీట్స్ ద్వారా ఆర్జీవీ తెలిపారు. రెండు భాగాలుగా ఈ మూవీని తీస్తానని ఆయన చెప్పుకున్నారు.
గురువారం ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్లో, "నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను.. ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ, రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి." అని చెప్పారు.
"అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం. ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది.. మొదటి పార్ట్ “వ్యూహం”, 2ంద్ పార్ట్ “శపథం”.. రెండింటిలోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా వుంటాయి." అని మరో ట్వీట్లో తెలిపారు.
"రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం" షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్, పార్ట్ 2 “శపథం"లో తగులుతుంది. "వ్యూహం" చిత్ర నిర్మాత నాతో అంతకు ముందు 'వంగవీటి' సినిమా తీసిన దాసరి కిరణ్." అని ఇంకో ట్వీట్లో వెల్లడించారు.
చివరగా "ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక, ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు." అని చెప్పుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



