చిరు చేసిన అన్యాయం మర్చిపోలేకపోతున్నాడు
on Apr 10, 2017
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరి వాడేలే సినిమా గుర్తుంది కదా? రామ్చరణ్ని ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేద్దామన్న చిరంజీవి నిర్ణయం బెడిసికొట్టింది. తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని కృష్ణవంశీ నిలబెట్టుకోలేకపోయాడు. అయితే.. ఆ సినిమా విషయంలో జరిగిన ఓ చిన్న పొరపాటు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాలో చరణ్ తాతయ్య పాత్రకు ముందుగా కన్నడ నటుడు రాజ్కిరణ్ని ఎంచుకొన్న సంగతి తెలిసిందే.
దాదాపు సగం సినిమా పూర్తయిన తరవాత చిరంజీవికి రషెష్ చూపించారు. రాజ్ కిరణ్ పాత్ర రామ్చరణ్ని డామినేట్ చేసిందని గ్రహించిన చిరు... రాజ్కిరణ్ని తప్పించి ఆ స్థానంలో ప్రకాష్రాజ్ని తీసుకోమని సలహా ఇచ్చాడు. దాంతో కృష్ణవంశీ రాజ్కిరణ్ని హఠాత్తుగా తొలగించి, తనపై తెరకెక్కిన సన్నివేశాల్ని ప్రకాష్ రాజ్తో రీషూట్ చేశారు. ఆసమయంలో చిత్రబృందం తనపై అమర్యాదగా ప్రవర్తించిందని వాపోతున్నాడు రాజ్ కిరణ్.
తనని తొలగిస్తున్నట్టు గానీ, ఆ పాత్రలో మరో నటుడు వస్తున్నట్టు గానీ ఎవ్వరూ తనకు చెప్పలేదని, తన పారితోషికంగా రావాల్సిన మొత్తంలో పది లక్షలు ఎగ్గొట్టారని స్టేట్మెంట్ ఇచ్చాడు రాజ్కిరణ్. చిరంజీవి వల్లే.. తనని తప్పించారని, ఓ పాత్ర కోసం ఎవర్ని ఎంచుకోవాలో, ఎవర్ని తీసేయాలో అది దర్శకుడి నిర్ణయమని, దాన్ని శిరసావహిస్తానని, అయితే... తనని తొలగించిన తీరు మాత్రం అమర్యాద పూర్వకంగా ఉందని గుర్తు చేసుకొన్నాడు రాజ్ కిరణ్. మరి వీటిపై కృష్ణవంశీ గానీ, ఆసినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బండ్ల గణేష్ గానీ స్పందిస్తారా? చూడాల్సిందే.