'సర్కారువారి పాట'ను బీట్ చేసిన 'రాధే శ్యామ్'
on Jul 11, 2020
పాన్ ఇండియా స్టార్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ రికార్డులను ఇప్పట్నుంచే షురూ చేసింది. శుక్రవారం వెల్లడించిన ఆ సినిమా ఫస్ట్ లుక్కు సోషల్ మీడియాలో అపూర్వమైన స్పందన లభించింది. ట్విట్టర్ ప్లాట్ఫామ్పై టాప్ ట్రెండింగ్లో ఉన్న ఆ లుక్ తెలుగు సినిమాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. 24 గంటల్లో 6.3 మిలియన్ ట్వీట్స్తో అత్యధిక ట్వీట్స్ సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఇదివరకు మహేశ్ మూవీ 'సర్కారువారి పాట' 4.4 మిలియన్ ట్వీట్స్తో సాధించిన రికార్డును అది బద్దలు కొట్టింది. ప్రభాస్ మేనియా ప్రేక్షకుల్లో ఏ రీతిలో ఉందో ఇది తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు వివిధ భాషల సినీ పరిశ్రమల వారు 'రాధే శ్యామ్' టీమ్కు అభినందనలు తెలియజేయడంతో #RadheShyam హ్యాష్ట్యాగ్ స్వల్ప సమయంలోనే ట్రెండింగ్లోకి వచ్చేసింది. పైగా 'బాహుబలి: ద బిగినింగ్' సినిమా విడుదలై జూలై 10 నాటికి ఐదేళ్ల పూర్తవడం కూడా దానికి కలిసొచ్చింది. ఫలితంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా రోజంతా కొనసాగింది. లైక్స్, కామెంట్స్, రిట్వీట్స్, ఫొటోల షేరింగ్ వంటి వాటితో వాళ్లు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఫస్ట్ లుక్లో ప్రభాస్, పూజా హెగ్డే కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అది కాపీ లుక్ అంటూ స్పాయిలర్లు ఎంత ప్రయత్నించినా దాని హవాను అడ్డుకోలేకపోయారు. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై రెబల్స్టార్ కృష్ణంరాజు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని టి సిరీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "ఉన్నంత కాలం భూమి ఆకాశం, నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్" అంటూ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా తన సినిమా గురించి ముందుగానే ఈ స్థాయి గొప్పలకు పోరు. కానీ అతను చేసిన ట్వీట్లో 'రాధే శ్యామ్'పై అతనికున్న అంతులేని నమ్మకం కనిపిస్తోందని చిత్ర బృందం అంటోంది. చూద్దాం.. రాధాకృష్ణ నమ్మకం ఎంతగా నిజమవుతుందో!!