అమెరికాలో 'పొన్నియిన్ సెల్వన్' ప్రభంజనం!
on Oct 8, 2022
మణిరత్నం ఎపిక్ ఫిల్మ్ 'పొన్నియిన్ సెల్వన్' బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది. మిగతా భాషల్లో సరిగా ఆడకపోతున్నా, ఒరిజినల్ తమిళ వెర్షన్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. జయం రవి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, త్రిష, శరత్కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ను దాటిన ఈ సినిమా, ఆరు రోజుల్లో రూ. 300 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంది. దీంతో మణిరత్నం తొలి రూ. 100 కోట్ల గ్రాస్, రూ. 200 కోట్ల గ్రాస్, రూ. 300 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది 'పొన్నియిన్ సెల్వన్'.
కాగా, యుఎస్ఏ బాక్సాఫీస్ దగ్గర 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసిన ఈ మూవీ ఇంకో 5 లక్షల డాలర్లను ఆర్జిస్తే, అమెరికాలో ఆల్-టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ్ ఫిల్మ్గా నిలుస్తుంది. ఇంతదాకా ఆ రికార్డు రజనీకాంత్-శంకర్ మూవీ '2.0' పేరిట ఉంది. ఆదివారంతో ఆ రికార్డు 'పీఎస్-1' చేజిక్కించుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కల్కి కృష్ణమూర్తి రచించిన చారిత్రక నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా మణిరత్నం రూపొందిస్తోన్న రెండు భాగాల సినిమాలో 'పీఎస్-1' మొదటిది. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణం, తోట తరణి కళాదర్శకత్వం వహించిన ఈ మూవీ చోళ రాజులు, వారి ప్రత్యర్థుల మధ్య సంఘర్షణను, ఆదిత్య కరికాలన్-నందిని మధ్య విఫలమైన ప్రేమ కారణంగా ఏర్పడిన పరిణామాలను తెలియజేస్తుంది.
Also Read