పవన్ సరసన శ్రీలంక సుందరి?
on Feb 13, 2020
పవన్ కల్యాణ్తో చిత్రానికి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టడానికి క్రిష్ జాగర్లమూడి ఎక్కువ సమయం తీసుకోలేదు. అంతకు ముందు పవన్తో కథ ఓకే చేయించుకోవడానికీ ఎక్కువ సమయం తీసుకోలేదు. చిత్రీకరణ ప్రారంభించడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. కానీ, కథానాయికను ఎంపిక చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం ఒక సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయిక ఎంపిక ఓ పట్టాన పూర్తి కావడం లేదు.
క్రిష్ సినిమాలో పవన్ సరసన కథానాయికగా మొదట పూజా హెగ్డే పేరు వినిపించింది. తర్వాత కియారా అడ్వాణీ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత వాణీ కపూర్ లిస్టులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా శ్రీలంక సుందరి, హిందీ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేరు వినపడుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఏ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. వరుణ్ తేజ్ పక్కన 'లోఫర్'లో నటించిన దిశా పటానీ పేరూ పరిశీలనలో ఉందట. అన్నట్టు ఈ సినిమాకు 'విరూపాక్ష' టైటిల్ పరిశీలనలో ఉంది.