ENGLISH | TELUGU  

కొత్త రిలీజ్ డేట్స్.. కొంచెం క్లారిటీ, కొంచెం కన్ఫ్యూజన్!

on Feb 1, 2022

'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ రావడంతో పలు సినిమాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా 'ఆర్ఆర్ఆర్'తో పాటు పలు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో నిర్మాతలు చర్చింది సినిమాల విడుదల తేదీలపై నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆర్ఆర్ఆర్ తో పాటు పలు సినిమాలు తమ రిలీజ్ డేట్ ని ప్రకటించాయి.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'.  కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని జనవరి 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే కరోనా థర్డ్ వేవ్ దెబ్బతో ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడింది. కరోనా పరిస్థితులను బట్టి మార్చి 18 లేదా ఏప్రిల్ 28 న సినిమాని విడుదల చేస్తామని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే తాజాగా 'ఆర్ఆర్ఆర్'ను మార్చి 25 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

ఆర్ఆర్ఆర్ మార్చి 25 న విడుదలవుతున్న నేపథ్యంలో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ సినిమాని ఏప్రిల్ 29 కి వాయిదా వేసినట్లు ఆ వెంటనే ఆచార్య టీమ్ ప్రకటించింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆచార్య'. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉండగా కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఏప్రిల్ 1 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ తో మరోసారి ఆచార్య విడుదల తేదీ మారింది.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల మల్టీస్టారర్ 'భీమ్లా నాయక్' విడుదల తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 న సినిమాని విడుదల చేస్తామంటూ భీమ్లా నాయక్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. నిజానికి భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కావాల్సి ఉంది. అయితే జనవరి 7 న 'ఆర్ఆర్ఆర్' విడుదల ఉండటంతో.. ఆ మూవీ మేకర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అని భీమ్లా నాయక్ మేకర్స్ ప్రకటించడంతో.. ఫిబ్రవరి 25 నే సినిమాని విడుదల చేయాలని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 1 కి వారం ముందు మార్చి 25 న ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో.. గతంలో మాదిరి మళ్ళీ ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ తో భీమ్లా నాయక్ వాయిదా పడుతుందేమోనన్న ఆందోళన వారిలో నెలకొంది.

వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ 'ఎఫ్-3' విడుదలపై కూడా క్లారిటీ వచ్చింది. మొదట ఎఫ్-3 ని ఫిబ్రవరి 25 న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చిన నేపథ్యంలో.. ఎఫ్-3 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 28 కి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 28 కే వస్తున్నట్లు తాజాగా ఎఫ్-3 మూవీ టీమ్ ప్రకటించింది.

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' ఏప్రిల్ నుంచి మే కి వెళ్ళిపోయింది. 'సర్కారు వారి పాట'ని కూడా మొదట సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే థర్డ్ వేవ్, మహేష్ మోకాలి సర్జరీ ఇలా పలు కారణాలతో ఈ సినిమాకి ఏప్రిల్ 1 కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా మరింత వెనక్కి వెళ్ళింది. 'సర్కారు వారి పాట'ని మే 12 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'గని' విడుదలపై కూడా ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఈ సినిమాని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 న విడుదల చేస్తామని తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. ఓ రకంగా ఈ సినిమా విడుదల భీమ్లా నాయక్ విడుదలపై ఆధారపడి ఉందని చెప్పొచ్చు. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న విడుదలైతే గని మార్చి 4 కి వచ్చే అవకాశముంది. ఒకవేళ భీమ్లా నాయక్ ఏప్రిల్ 1 కి వెళ్తే గని ఫిబ్రవరి 25 కి విడుదలయ్యే అవకాశముంది.

ఇక ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' కొత్త విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఆ సినిమా మార్చి 11 న విడుదల కానుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన 'రాధేశ్యామ్' కూడా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కి రెండు వారాల ముందు మార్చి 11 న విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.