"నా భర్త చంపుతానని బెదిరిస్తున్నాడు".. నటి రాధ పోలీస్ కంప్లయింట్!
on Jul 5, 2021
ఏప్రిల్లో తన భర్త వసంతరాజా తనను కొడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసిన రాధ, మూడు నెలలు తిరక్కముందే మరోసారి ఫిర్యాదు చేశారు. ఈసారి తనను చంపుతానంటూ భర్త బెదిరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. 2002లో అశోకన్ డైరెక్ట్ చేసిన 'సుందర ట్రావెల్స్' సినిమాలో మురళి సరసన నటించడం ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రాధ. ఆ సినిమా బాగా ఆడినా, ఆమెకు మంచి పేరు తెచ్చినా, తర్వాత ఆశించిన రీతిలో ఆమెకు అవకాశాలు రాలేదు.
రెండేళ్ల క్రితం సబ్-ఇన్స్పెక్టర్ వసంతరాజాతో కలిగిన స్నేహం ప్రేమగా మారి, వివాహానికి దారితీసింది. ఏడాది కాలంగా వారు సాలిగ్రామ్లో కాపురం ఉంటున్నారు. అయితే స్వల్ప కాలంలోనే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. తన సన్నిహితులు, స్నేహితులతో తరచూ ఫోన్లలో రాధ మాట్లాడుతుండటం చూసిన వసంతరాజా ఆమెను అనుమానిస్తూ రావడమే కాకుండా, తనపై చేయిచేసుకొని వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఏప్రిల్లో తొలిసారి విరుగమ్బాకమ్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు రాధ.
దానిపై పోలీసులు విచారణ చేపట్టిన సందర్భంలో తమ మధ్య సమోధ్య కుదిరిందనీ, ఇద్దరం ప్రశాంతంగా కాపురం చేసుకుంటామంటూ తెలపడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు రెండోసారి వసంతరాజాపై రాధ ఫిర్యాదు చేశారు. అందులో భర్త తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా తనకేం భయంలేదనీ, పోలీస్ స్టేషన్లోని సబ్ ఇన్స్పెక్టర్లు భారతి, ఇలంబరుతి తన మనుషులేననీ అతను చెప్తున్నాడనీ ఆమె తెలిపారు. తనను అన్నివిధాలా నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడనీ ఆమె పేర్కొన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
