APHERMC సిఫార్సులపై మోహన్బాబు యూనివర్శిటీ కీలక ప్రకటన
on Oct 8, 2025
మోహన్బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్(APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు. కమిషన్ చేసిన సిఫార్సులను మోహన్బాబు విశ్వవిద్యాలయం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. మంచు విష్ణు విడుదల చేసిన ప్రకటనలో ఏముందో తెలుసుకుందాం.
‘అవి కేవలం సిఫార్సులు మాత్రమేనని, ఆ సిఫార్సులు ప్రస్తుతం గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయని దయచేసి గమనించగలరు. ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు సదరు సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా ‘స్టే’ ఉత్తర్వును హైకోర్టు వారు జారీ చేసి ఉండగా, ఎపిహెచ్ఇఆర్ఎంసి వారు కోర్టు ఉత్తర్వును ధిక్కరించి పోర్టల్లో పెట్టడం దురదృష్టకరం. వారు చేసిన సిఫార్సులు సరికాదని మోహన్బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది మరియు ఈ విషయంపై విచారణ జరుపుతున్న గౌరవనీయ హైకోర్టు న్యాయం చేకూరుస్తుందని విశ్వాసంతో ఉంది.
మోహన్బాబు విశ్వవిద్యాలయం నేడు భారతదేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఒకటిగా నిలుస్తూ రాయలసీమను ఉన్నత విద్యకు గుర్తింపు పొందిన కేంద్రంగా మారుస్తోంది. గత కొన్నేళ్లుగా మా విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్లోని విద్యార్థులకు అత్యధిక ప్లేస్మెంట్లు మరియు వేతన ప్యాకేజీలను స్థిరంగా సాధిస్తోంది. ఇది దేశంలోని అనేక ప్రభుత్వ లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సాధ్యపడని రికార్డు. 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించబడినప్పటి నుండి ఈ విశ్వవిద్యాలయం బలమైన సామాజిక నిబద్ధతను కొనసాగిస్తోంది.
ఎంతోమందికి ఉచిత విద్యను అందించడం, సాయుధ దళాలు మరియు పోలీసు సిబ్బంది పిల్లలకు పూర్తి స్కాలర్షిప్స్ ఇవ్వడం మరియు అనాథలను దత్తత తీసుకుని వారికి పూర్తి విద్య మరియు సంరక్షణ అందించడం వంటివి చేస్తోంది. విద్య మరియు సమాజ సేవలో మా సహాయ సహకారాలు
బహిరంగ రికార్డులలో ఉన్నప్పటికీ, దురుద్దేశంతో కొంతమంది పదే పదే మా ప్రయత్నాలను విమర్శిస్తున్నారు.
మా అకడమిక్ శ్రేష్ఠత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబిస్తున్నది. QS100 ర్యాంకు పొందిన పెన్ స్టేట్ యూనివర్శిటీ (యుఎస్ఎ)తో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామును ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి విశ్వవిద్యాలయం ఎంబియు. మాకు ఆర్డబ్ల్యుటిహెచ్ ఆకెన్ విశ్వవిద్యాలయం (జర్మనీ) మరియు విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం (యుఎస్ఎ)తో కూడా అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులు భారతదేశంలో తమ డిగ్రీలను కొనసాగిస్తూనే విదేశి యూనివర్శిటిలలో సెమిస్టర్ మరియు పరిశోధన కార్యక్రమాలను అభ్యసించడానికి వీలు కలుగుతుంది.
కొద్దిమంది సభ్యులతో ఏర్పడిన కమిటీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో స్వల్ప పరిపాలన అంశాలను పెంచి చూపి అనవసర వివాదాన్ని సృష్టించడం దురదృష్టకరం. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం మాకు పూర్తిగా సహకరించిందని అదే కమీషన్ తన నివేదికలో పేర్కొనడం ఎలాంటి తప్పు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా గౌరవనీయ ఛాన్సలర్ డాక్టర్ ఎమ్.మోహన్బాబుగారి మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తివంతం చేసే ప్రయత్నాన్ని కొనిసాగిస్తున్నామని తెలియజేస్తున్నాము.
విష్ణు మంచు
ప్రో-ఛాన్సలర్
మోహన్బాబు యూనివర్శిటీ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



