ENGLISH | TELUGU  

మణిశర్మ పాటలు, రెహమాన్‌ పేరు.. అలా ‘చూడాలని వుంది’తో ఫస్ట్‌ ఛాన్స్‌!

on Jul 11, 2024

యమహా నగరి కలకత్తా పురి.., అందాల ఆడబొమ్మా.., స్వప్న వేణువేదో.., నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు.., అమ్మాయే సన్నగా.., చెప్పవే చిరుగాలి.., నీ నవ్వుల తెల్లదనాన్ని.. ఇలాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌ చేసి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలందరి సినిమాలకూ సంగీతాన్ని అందించి వారి సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయన ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 1997లో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మణిశర్మ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు. అలాగే ఎన్నో సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేశారు. ప్రస్తుతం అప్‌కమింగ్‌ హీరోలకు, ఒక రేంజ్‌ ఉన్న హీరోలకు సంగీతాన్ని అందిస్తూ ఇప్పటికీ తనలో అద్భుతమైన సంగీతాన్ని అందించే సత్తా ఉందని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. తను చేసిన మెలోడీ సాంగ్స్‌తో ఆహ్లాదాన్ని అందించడమే కాదు, మాస్‌ సాంగ్స్‌కి ఆడియన్స్‌తో స్టెప్పులేయించిన మణిశర్మ పుట్టినరోజు జూలై 11. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. 

తండ్రి నాగయజ్ఞశర్మ మంచి వయొలిన్‌ కళాకారుడు. అవకాశాలు వచ్చినా కుటుంబాన్ని నడిపించేంత ఆదాయం రాకపోవడంతో తన పిల్లలు సంగీతం నేర్చుకొని ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వారిని ఆ పక్కకు రాకుండా చూశారు. కానీ, సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉన్న మణిశర్మ తనకు వాయించడం రాకపోయినా హార్మోనియం పెట్టెతో కుస్తీ పట్టి నేర్చుకున్నాడు. తండ్రికి అది ఇష్టం లేక హార్మోనియంను దాచేసేవారు. కానీ, తండ్రి లేనప్పుడు అమ్మను రిక్వెస్ట్‌ చేసి దాన్ని బయటికి తీసి వాయించేవాడు. మణికి సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించిన తండ్రి.. అతనికి వయొలిన్‌, మాండొలిన్‌, గిటార్‌ నేర్పించారు. అయితే కీబోర్డ్‌ ప్లే చేసే వారికే ఎక్కువ రెమ్యునరేషన్‌ చెల్లిస్తున్నారని తెలుసుకొని తండ్రి సలహా మేరకు కీబోర్డ్‌ కూడా నేర్చుకున్నాడు.

వెస్ట్రన్‌ మ్యూజిక్‌లో ఇళయరాజా, ఎ.ఆర్‌.రెహమాన్‌లకు గురువైన జాకబ్‌ జాన్‌ దగ్గర వెస్ట్రన్‌ మ్యూజిక్‌ నేర్చుకున్నాడు మణిశర్మ. 18 ఏళ్ళ వయసులోనే చదువుకి స్వస్తి పలికి మ్యూజిక్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇళయరాజా, రాజ్‌కోటి, కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద శిష్యరికం చేశారు. ఎ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి కీ బోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశారు. ‘క్షణక్షణం’ చిత్రానికి కీరవాణి దగ్గర పనిచేస్తున్నప్పుడు మణిశర్మ టాలెంట్‌ని గమనించి తన నెక్స్‌ట్‌ సినిమా ‘రాత్రి’ చిత్రానికి రీరికార్డింగ్‌ చేసే బాధ్యతను అప్పగించారు రామ్‌గోపాల్‌వర్మ. ఆ తర్వాత నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో 1992లో రూపొందిన ‘అంతం’ చిత్రంలో ‘చలెక్కి ఉందనుకో..’ పాట చేశారు. మణిశర్మ సంగీతం అందించిన తొలి పాట అదే. ఈ చిత్రానికి ఆర్‌.డి.బర్మన్‌ 3 పాటలు, కీరవాణి 1 పాట చేశారు. కానీ, టైటిల్స్‌లో వారిద్దరి పేర్లూ వేయకుండా మణిశర్మ పేరు వేయడం విశేషం. 

ఈ సినిమా తర్వాత మణిశర్మకు ఐదేళ్ళ పాటు ఒక్క అవకాశం కూడా రాలేదు.  అయితే వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘ప్రేమించుకుందాం..రా’ చిత్రంలో మూడు పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేసే అవకాశం వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చూడాలని వుంది’ చిత్రంతోనే పూర్తి స్థాయి సంగీత దర్శకుడయ్యారు. అయితే ఈ సినిమా కంటే ముందు 1997లో ఏవీయస్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘సూపర్‌ హీరోస్‌’, ‘ప్రేమించుకుందాం..రా’, ‘బావగారూ బాగున్నారా’, ‘గణేష్‌’ చిత్రాలు రిలీజ్‌ అయిన తర్వాతే 1998లో ‘చూడాలని వుంది’ విడుదలైంది. మణిశర్మకు ఈ సినిమా అవకాశం రావడం వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. తన సహచరుడైన ఎ.ఆర్‌.రెహమాన్‌ అప్పటికే టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్థాయికి వెళ్లిపోయారు. నిర్మాత అశ్వినీదత్‌కి మంచి మ్యూజిక్‌ టేస్ట్‌ ఉంది. తన సినిమాకి కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ అంటే చిరంజీవి ఏమంటారోనని మణిశర్మతో క్యాచీగా వుండే పాటలు చేయించుకొని చిరంజీవి దగ్గరికి వెళ్లారు. ఎ.ఆర్‌.రెహమాన్‌ మన సినిమాకి పాటలు పంపాడంటూ ఆ క్యాసెట్‌ చిరంజీవికి ఇచ్చారు దత్‌. అవి విన్న చిరంజీవి చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఆ పాటలు మణి చేశాడంటూ అసలు విషయం చెప్పారు దత్‌. అలాంటి ఓ చిన్న డ్రామా తర్వాత మణిశర్మకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మొదటి అవకాశం వచ్చింది. 

సాధారణంగా మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ పాటలు కూడా పాడుతుంటారు. కొందరు తమ కెరీర్‌లో ఒక్క పాటైనా పాడి ఉంటారు. కానీ, మణిశర్మ మాత్రం ఒక్క పాట కూడా పాడలేదు. దానికి కారణం ఆయన గాత్రం పాటలు పాడేందుకు అనువుగా ఉండదని. అయితే కీరవాణి దగ్గర పనిచేస్తునప్పుడు ఎలాగైనా అతనితో పాట పాడించాలని ఒక సినిమాకి పట్టుపట్టి పాడించారు. కానీ, ఆ పాట రికార్డింగ్‌ అయిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. అలాగే ‘బావగారూ బాగున్నారా’ చిత్రంలోని ఓ పాటకు తన గొంతుతో విండ్‌ ఎఫెక్ట్‌ ఇచ్చారు మణి. అయితే ఆ పాటను సెన్సార్‌ వారు కట్‌ చేశారు. అలాగే తొలిరోజుల్లో ఒక సినిమాకి అడ్వాన్స్‌ తీసుకొని పాటలు చేశారు. అందులో ఒక పాటకి చిన్న హమ్మింగ్‌ పాడాల్సి వచ్చింది. అది పాడి రికార్డ్‌ చేసి టేప్‌ను ప్రొడ్యూసర్‌కి ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ ఆ సినిమా నుంచి మణిశర్మను తప్పించి మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ని పెట్టుకున్నారు. తను పాట పాడితే తనకి, ఆ సినిమాకి డేంజర్‌ అని గ్రహించిన మణి ఆ తర్వాత పాట పాడడం కాదు కదా.. కనీసం మైక్‌ పట్టుకొని మాట్లాడడం కూడా చేయలేదట. 

తను ఏ సినిమాలోనూ పాడకపోయినా ప్రేక్షకులకు మాత్రం వీనుల విందైన పాటల్ని అందించారు. క్లాస్‌, మాస్‌, మెలోడీ, ఫాస్ట్‌బీట్‌.. ఇలా అన్ని రకాల పాటలతో ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు మణిశర్మ. తన కెరీర్‌లో చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌ వంటి హీరోలకే ఎక్కువ సినిమాలు చేశారు. ఇక తను చేసిన పాటలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. వాటిలో ‘చూడాలని వుంది’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డుతోపాటు నంది అవార్డు, ‘చిరునవ్వుతో’ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది అవార్డు, ‘ఒక్కడు’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది, ఫిలిం ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. తన తర్వాత ఎంతో మంది కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ వచ్చినా, కొత్త తరహా సంగీతాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినా తన మార్క్‌ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడిగా ఇప్పటికీ కొనసాగుతున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.