ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విష్ణు 'టామ్టామ్' వ్యాఖ్యలు!
on Jul 23, 2021
"కుడిచేయి చేసే దానం ఎడమచేతికి తెలియకూడదు. నా దృష్టిలో ఒక పెద్ద తప్పు చాలామంది చేసేదేమంటే నేను అంతిస్తున్నాను, ఇంతిస్తున్నాను అని అనౌన్స్ చేస్తున్నారు. అలా అనౌన్స్ చేయకుండా దానం ఇచ్చేవాళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వందలమంది ఉన్నారు. ప్రతి దాన్నీ టామ్టామ్ చేసుకోవడంలో నాకు నమ్మకం లేదు." అన్నారు మంచు విష్ణు. ఈ మాటలు ఆయన ఎవర్ని ఉద్దేశించి అన్నారనే దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. రానున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉన్నానని ఇప్పటికే విష్ణు ప్రకటించారు. ఆయనకు బాలకృష్ణతో పాటు కృష్ణ, కృష్ణంరాజు కుటుంబాల నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నట్లు వినిపిస్తోంది.
మరోవైపు ఇప్పటికే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానంటూ ప్యానల్ను కూడా ప్రకటించిన ప్రకాశ్రాజ్కు మెగా కాంపౌండ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయనేది బహిర్గతమైంది. బాహాటంగా చెప్పకపోయినా, తమ్ముడు నాగబాబుతో తాను ప్రకాశ్రాజ్ పక్షమని చిరంజీవి చెప్పించారు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలోని నటులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టమవుతోంది.
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దానం చేసేవాటిని 'టామ్ టామ్' చేసుకోవడంపై విష్ణు నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో కరోనా క్రైసిస్ చారిటీ పేరిట చిరంజీవి పలువురు కార్మికులకు నిత్యావసరాలు ఉచితంగా అందజేశారు. అనేకమందికి అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేయించారు. ఇక ఆయన బ్లడ్ బ్యాంక్ చేసే సేవల సంగతి సరేసరి. అలాగే పావలా శ్యామలకు 'మా' మెంబర్షిప్ ఇప్పించారు. కరోనా కాటుకు బలైన నటుడు-జర్నలిస్ట్ టీఎన్ఆర్తో పాటు మరికొంతమందికి కూడా ఆయన తక్షణ సాయం కింద కొంత డబ్బు అందజేశారు. ఇవన్నీ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకొనే విష్ణు 'టామ్ టామ్' వ్యాఖ్యలు చేశారా? అనే చర్చ నడుస్తోంది.
"అయితే చేసిన మంచి పని చెప్పాలి. దానివల్ల ఇంకో పదిమంది ఇన్స్పైర్ అవుతారు. కానీ అదే అజెండాగా ఉండకూడదు. ఇక్కడ ఎవరు హెల్ప్ చేయట్లోదో చెప్పండి. నేను ఆరేడు సంవత్సరాల క్రితమే పదిహేను గ్రామాల్ని దత్తత తీసుకున్నా. మహేశ్ దత్తత తీసుకోలేదా? చాలామంది గ్రేట్ వర్క్ చేస్తున్నారు. ఈ కరోనా సంక్షోభంలో ప్రస్తుత మా అధ్యక్షులు నరేశ్గారు చాలా సహాయం చేశారు." అని కూడా విష్ణు చెప్పడం గమనార్హం.