మహేశ్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్మెంట్ ఎప్పుడంటే...
on Apr 15, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్లో ఓ క్లాసిక్లా నిలిచిన చిత్రం 'అతడు'(2005). దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అది రెండో ప్రయత్నం. అన్ని రకాల వాణిజ్యాంశాలతో రూపొందిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్.. అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఆపై ఐదేళ్ళ తరువాత వీరిద్దరి కలయికలో వచ్చిన 'ఖలేజా' (2010) బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైనా.. బుల్లితెరపై బ్లాక్బస్టర్ అయింది. కట్ చేస్తే.. పదకొండేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రాబోతోంది. గత రెండు చిత్రాలకు భిన్నంగా వీరి థర్డ్ జాయింట్ వెంచర్ ఉండబోతోందని టాక్.
అంతేకాదు.. మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని టాక్. అలాగే ఏడాది చివరలో రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళేలా ప్రణాళిక సాగుతోందని వినికిడి. ఈ లోపు తన చేతిలో ఉన్న 'సర్కారు వారి పాట'ని పూర్తిచేస్తారట మహేశ్.
కాగా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ వెంచర్ చేయాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడడంతో.. మహేశ్ కాంబో ప్రాజెక్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్తో చేయాల్సిన 'యన్టీఆర్ 30'ని సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తారక్ చేస్తున్న సంగతి తెలిసిందే.