
కోలీవుడ్ స్టార్ విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మహాన్'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.
'మహాన్' మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఈ సినిమాలో విక్రమ్, ధృవ్ తండ్రీకొడుకులుగానే కనిపించనున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఇది మద్యం మాఫియా చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతుంది. మద్య నిషేధ ఉద్యమ వీరుడి తనయుడైన గాంధీ మహాన్(విక్రమ్) మొదట ఓ సాధారణ ఉపాధ్యాయుడిగా పని చేస్తాడు. తండ్రి బాటలో నడిచి మధ్య నిషేధ ఉద్యమంలో పాల్గొనాలని కుటుంబసభ్యులు కోరగా.. అతను మాత్రం మద్యం మాఫియా కింగ్ గా ఎదుగుతాడు. అతణ్ణి అడ్డుకోవడానికి ధృవ్ రంగంలోకి దిగుతాడు. సాధారణ ఉపాధ్యాయుడిగా ఉన్న మహాన్ మద్యం మాఫియా సామ్రాజ్యానికి రాజులా ఎదగడానికి కారణం ఏంటి? అనే క్వశ్చన్ మార్క్ తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్.. తనయుడితో కలిసి 'మహాన్'గా అలరిస్తాడేమో చూడాలి.






