'మత్తు వదలరా' టీమ్ తో లావణ్య మూవీ.. క్లాప్ కొట్టిన రాజమౌళి!
on Nov 30, 2021
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మత్తు వదలరా'. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సింహా-రితేష్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు మంగళవారం నాడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా.. గుణ్ణం గంగరాజు కెమెరా స్విఛాన్ చేశారు. ఫస్ట్ షాట్ కి కొరటాల శివ దర్శకత్వం వహించారు.
యాక్షన్- కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాళ భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. 'మత్తు వదలరా'తో మ్యాజిక్ చేసిన సింహా-రితేష్ కాంబో లావణ్యతో కలిసి ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.