కోర్టు ముందు సమంత అయినా, సామాన్యులైనా ఒక్కటే!
on Oct 22, 2021
కోర్టు ముందు సెలబ్రిటీలైనా, సామాన్యులైనా ఒక్కటేననీ, సమంత కేసును అర్జంట్గా విచారించాల్సిన అవసరం లేదనీ కూకట్పల్లి కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ యూట్యూబ్ చానళ్లపై నటి సమంత గురువారం కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమె పిటిషన్ను సత్వరమే విచారణ జరపాలని ఆమె లాయర్ బాలాజీ కోర్టును కోరారు. సమంత పరువుకు భంగం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై జడ్జి స్పందిస్తూ, కోర్టు ముందు అంతా సమానమేనని చెప్పారు. వరుస ప్రకారం పిటిషన్ను విచారిస్తానని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాని ఆరోపిస్తూ సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, డాక్టర్ సి.ఎల్. వెంకట్రావుపై సమంత పరువునష్టం దావా వేశారు. నాగచైతన్యతో తన విడాకుల గురించి ఆ చానల్స్లో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ, తనను కించపరిచే వ్యాఖ్యలు చేశారనీ, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించారని తన పిటిషన్లో సమంత ఆరోపించారు. ఈ విషయంలో తనకు మీడియా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పేలా వారిని ఆదేశించాలని కోర్టును రిక్వెస్ట్ చేశారు. పరువునష్టంగా ఎంత కోరుకుంటున్నాననేది తర్వాత చెప్తానన్నారు.
నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్ వేయొచ్చన్న సమంత తరపు లాయర్ బాలాజీ వాదనతో కోర్టు ఏకీభవించింది. తన వ్యక్తిగత పరువు ప్రతిష్ఠలకు నష్టం కలిగించేలా మాట్లాడకుండా, వారిని నిరోధించాలన్న పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.
Also Read