'సోల్ సిస్టర్'తో కలిసి 'భూతల స్వర్గం'ను సందర్శించిన సమంత!
on Oct 23, 2021
టాప్ యాక్ట్రెస్ సమంత బద్రీనాథ్ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా తన హిమాలయ యాత్రను పూర్తి చేసింది. తన 'ఆత్మ సోదరి' (సోల్ సిస్టర్) శిల్పారెడ్డితో కలిసి కొద్ది రోజుల క్రితం 'చార్ ధామ్ యాత్ర'ను ప్రారంభించింది సమంత. ఎప్పటికప్పుడు ఆ యాత్రకు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూ వస్తోన్న ఆమె, తన యాత్రను ముగించినట్లు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక లాంగ్ నోట్ ద్వారా తెలియజేసింది. దాంతో పాటు శిల్పారెడ్డితో పాటు తాము ప్రయాణించిన చాపర్ ముందు నిలబడి దిగిన ఫొటోను షేర్ చేసింది.
"ఒక అద్భుతమైన యాత్ర ముగిసింది.. చార్ ధామ్ యాత్ర.. యమనోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్. నేనెప్పుడూ హిమాలయాలంటే ఆకర్షితురాలిని అవుతుంటాను. మహాభారతం ఎప్పుడైతే చదివానో అప్పట్నుంచీ ఈ భూతల స్వర్గాన్ని, ఈ గొప్ప రహస్యాల ప్రదేశాన్నీ, ఈ దేవతల నివాసాన్ని సందర్శించాలనేది నా కల. నేను ఆశించిన విధంగానే ఈ యాత్ర అంతా సాగింది. నిర్మలమై, గంభీరమైన.. కల్పన, వాస్తవికత మధ్య సంక్లిష్టమైన కన్ఫ్యూజన్.. కచ్చితంగా ఉత్కంఠభరితమైంది!! నా హృదయంలో హిమాలయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నింటికంటే ప్రత్యేకమైంది.. ఈ అనుభవాన్ని నీతో పంచుకున్నందుకు శిల్పారెడ్డి. #soulsister ." అని రాసుకొచ్చింది సమంత.
ఈ పోస్ట్ను షేర్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన ఫీలింగ్స్ను తెలియజేస్తూ, "ఇప్పుడు మీరేమిటో దానికి కృతజ్ఞతతో ఉండండి, రేపు ఏం కావాలనుకుంటున్నారో దానికై పోరాడుతుండండి" అని రాసింది.
భర్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఆమె తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి హిమాలయ యాత్రకు వెళ్లింది. మొదటగా రిషికేష్ను సందర్శించిన ఆమె, తన చార్ ధామ్ యాత్రలో భాగంగా మిగతా పుణ్యక్షేత్రాలను సందర్శించింది. ఆ యాత్రకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది.