`కళ్యాణ మంటపం`కి 50 వసంతాలు!
on Jun 25, 2021
దేవదాసీ వ్యవస్థ కారణంగా బలైపోయిన ఓ అమాయకురాలి కథతో తెరకెక్కిన చిత్రం `కళ్యాణ మంటపం`. కన్నడ సినిమా `గజ్జె పూజె` (1969) ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని `రీమేక్ స్పెషలిస్ట్` వి. మధుసూదనరావు తీర్చిదిద్దారు. నటభూషణ శోభన్ బాబు, అందాల తార కాంచన జంటగా నటించిన ఈ సినిమాలో చిన్నప్పటి కాంచన పాత్రలో బేబి శ్రీదేవి అలరించారు. జగ్గయ్య, అంజలీదేవి, గుమ్మడి, రమాప్రభ, నాగభూషణం, పండరీబాయి, అన్నపూర్ణ, సంధ్యారాణి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
పి. ఆదినారాయణరావు సంగీతమందించిన ఈ సినిమాకి దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ సాహిత్యమందించారు. పాటల్లో ``చుక్కలు పాడే శుభమంత్రం``, ``సరిగమపదనిస``, ``పలికే వారుంటే`` విశేషాదరణ పొందాయి. అగ్ర దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, `యువచిత్ర` సంస్థ అధినేత కె. మురారి సహాయక దర్శకులుగా పనిచేసిన ఈ చిత్రాన్ని జెమిని సంస్థ సమర్పణలో మధు మూవీస్ పతాకంపై చిత్ర దర్శకుడు వి. మధుసూదనరావు స్వయంగా నిర్మించారు. 1971 జూన్ 25న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న `కళ్యాణ మంటపం`.. నేటితో 50 వసంతాలు పూర్తిచేసుకుంది.