జమున, కైకాలకు ' మా అసోసియేషన్ ' సన్మానం
on Jun 8, 2016
``సీనియర్లను గౌరవించుకోవడం మన సాంప్రదాయం. సీనియర్ నటీనటుల్ని సత్కరించుకోవడం మన బాధ్యత. పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగిన సీనియర్లను ఎంపిక చేసి దశల వారీగా సత్కరించుకునేందుకు, గౌరవించుకునేందుకు యాన్యువల్ జనరల్ బాడీ (ఎజిఎం) మీటింగులను వేదికగా చేస్తున్నాం`` అన్నారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, `మా` జనరల్ సెక్రటరీ శివాజీ రాజా. ఈనెల 12న జరిగే జనరల్ బాడీ (ఎజిఎం -2016) మీటింగులో సీనియర్ నటీనటులైన జమున, కైకాల సత్యనారాయణలను సత్కరిస్తున్నామని తెలిపారు.
`మా` అధ్యక్షులు డా.రాజేంద్రప్రసాద్ మరిన్ని సంగతులు చెబుతూ -``నాటి మేటి కథానాయిక జమున ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నటీమణి. ఎక్కువ కాలం పరిశ్రమలో నటీమణిగా కొనసాగారు. నాటి తరంలో టాప్ హీరోయిన్. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్లకు సమకాళికులు, నవరసాల్ని వెండితెరపై పోషించిన గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ.. ఈ ఇద్దరినీ ఈసారి ఎజిఎం -2016 మీటింగులో సన్మానించాలని తీర్మానించాం. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు చేతులమీదుగా ఈ సన్మానం చేసేందుకు మా అసోసియేషన్ సిద్ధమవుతోంది. ఈ వేడుకకు నటీనటులంతా విచ్చేస్తారు. మేటి నటీనటుల్లో సీనియర్లందరికీ ఈ సన్మానం చేయనున్నాం`` అని తెలిపారు.
`మా` ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) శివాజీ రాజా మాట్లాడుతూ -``నిర్మాతల మండలి హాల్లో జూన్ 12 ఉదయం 9 గంటలకే సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కైకాల, జమునలకు సన్మానం చేస్తాం. ఇదే తరహాలో సీనియర్ నటీనటులందరినీ ఎంపిక చేసి పలు దపాలుగా జనరల్ బాడీ సమావేశాల్లో సన్మానాలు చేయాలని `మా` కమిటీ నిర్ణయించింది`` అని తెలిపారు.