ఎన్టీఆర్ దెబ్బకి ఫ్యాన్స్ సైలెంట్ అవుతారా!
on Feb 6, 2023
తమ అభిమాన హీరోల కొత్త సినిమాలకు సంబంధించిన విశేషాలు ఏమాత్రం ఆలస్యమైనా అప్డేట్స్ ఇవ్వండి అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'ఎన్టీఆర్ 30' అప్డేట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. అయితే ఇలా పదే పదే అప్డేట్స్ అంటూ నిర్మాతలపై అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దంటూ తన అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఎన్టీఆర్ సూచించాడు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా.. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్ 30' అప్డేట్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో.. ఆయన స్పందించిన తీరు ఆకట్టుకుంది. "మీకు మా కొత్త సినిమాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. దానిని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి రోజూ కొత్త అప్డేట్ కావాలంటే ఇవ్వడం సాధ్యం కాదు. అలా పదే పదే అడగటం వల్ల నిర్మాతల మీద అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ఇది నేను నా సినిమా గురించి మాత్రమే చెప్పట్లేదు. ఇండస్ట్రీలో అందరి పరిస్థితి ఇలాగే ఉంది. నిజంగా ఏదైనా అప్డేట్ ఉంటే మా కుటుంబసభ్యుల కంటే ముందు మీకే చెప్తాం" అని ఎన్టీఆర్ అన్నాడు.
అలాగే ఇక చివరిలో 'ఎన్టీఆర్ 30' గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు. "ఎన్టీఆర్ 30 విషయానికొస్తే ఈ నెలలోనే లాంచ్ ఉంటుంది. మార్చి 20 లోపు షూటింగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదలవుతుంది" అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
Also Read