మాస్ మహారాజా రెమ్యూనరేషన్ భారీగా పెంచాడా?
on Feb 6, 2023
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి రాణించిన స్టార్ హీరోలు అరుదనే చెప్పాలి. ఒకప్పుడు స్టార్ నటులుగా వెలుగొందిన వారి వారసులు వారి లెగసీని అందుకుంటూ తమ కెరీర్ కి రాచ బాట వేసుకుంటూ ఉంటారు. నాటి అగ్రహీరోలుగా రాణించిన నందమూరి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు స్టార్స్గా రాణిస్తున్నారు. ఇక ప్రభాస్ సైతం తన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న స్టారేనని చెప్పాలి. కిందటి తరంలో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా మెగాస్టార్ గా ఎదిగారు. కానీ ఆయన ఇమేజ్ తో ఆ కొణిదెల ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం ఏడెనిమిది మంది హీరోలు ఉన్నారు.
ఇలా స్టార్ల బ్యాగ్రౌండ్, లేదా టాప్ ప్రొడ్యూసర్స్ వారసులు మాత్రమే ఇక్కడ ఎక్కువగా రాణిస్తూ ఉంటారు. అయితే ఇలా వారసత్వంగా హీరోలుగా, స్టార్లుగా ఎంటర్ అయిన కొందరు రాణించలేకపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. వారసత్వం అనేది ఎల్లకాలం పని చేయదు. కెరీర్ ప్రారంభంలో మంచి చిత్రాలు, హీరోలు, నిర్మాతలు చేతిలో ఉండేందుకు ఇది దోహదం చేస్తుంది. దురదృష్టవశాత్తు కెరీర్ ప్రారంభంలో మూడు నాలుగు ఫ్లాప్లు వచ్చినా ఈ వారసత్వ హీరోలకు ఇంకా చాన్స్లు వస్తాయి. కానీ అది మరో ఐదారు చిత్రాల వరకు పనిచేస్తుందేమో? ఆ తర్వాత మాత్రం తమ సొంత టాలెంట్ తోనే వారు నిలబడాల్సి వుంటుంది. చిరంజీవి తర్వాత తరంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన నటుడు అంటే రవితేజ పేరు చెప్పొచ్చు.
ఈ తరంలో మాత్రం నాని నుంచి సిద్దు జొన్నలగడ్డ వరకు, విజయ్ దేవరకొండ నుంచి నిఖిల్ వరకు ఎందరో ఎలాంటి అండదండలు లేకుండా వచ్చి రాణిస్తూ ఉండటం శుభపరిణామం. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటే మాస్ మాస్ మహారాజా రవితేజ పేరును చెప్పుకోవాలి. ధమాకాతో సోలో హీరోగా 100 కోట్లు రాబట్టిన ఈయన వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి 200 కోట్ల క్లబ్ లో చేరారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు.ధమాకా చిత్రం కోసం ఆయన 17 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. వాల్తేరు వీరయ్యకు పాత్రనిడివి తక్కువైనా కూడా దాని ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని 15 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇక త్వరలో ఆయననుండి రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు వస్తున్నాయి.
ఈ రెండు చిత్రాలకు 20 కోట్ల పారితోషికాన్ని రవితేజ తీసుకున్నారట. త్వరలో ఆయన తన రెమ్యూనరేషన్ ని మరింత పెంచే యోచనలో ఉన్నాడని సమాచారం. రావణాసురతో పాటు రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు బాగా ఆడితే ఆయన తన పారితోషికాన్ని పెంచే ఉద్దేశ్యంలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన 22 నుంచి 25 కోట్ల లోపు రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. పాన్ ఇండియా బ్రాండ్ వస్తే అప్పుడు 30 కోట్ల వరకు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 30 కోట్లకి రవితేజ రీచ్ అయితే ఆయన టైర్ 1 స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడని పక్కాగా చెప్పవచ్చు.