డ్రైవర్, అసిస్టెంట్లతో కలిసి హైవే ఫుడ్ తిన్న జగ్గూభాయ్.. ఫొటో వైరల్!
on Jul 30, 2021
టాలీవుడ్లో సింప్లిసిటీకి, ముక్కుసూటి తత్వానికి కేరాఫ్ అడ్రస్ జగపతిబాబు. శోభన్బాబు తర్వాత ఫ్యామిలీ స్టార్గా రాణించిన జగపతిబాబు కెరీర్ 'లెజెండ్' మూవీతో మరో టర్న్ తీసుకుంది. ఆ మూవీలో విలన్ క్యారెక్టర్లో సూపర్బ్గా రాణించడంతో తమిళ, కన్నడ, మలయాళ చిత్ర రంగాల్లోనూ ఆయనకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడాయన సౌత్ ఇండియాలోని నాలుగు భాషా చిత్రసీమల్లో పాపులర్ యాక్టర్.
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్తో షూటింగ్స్ నిలిచిపోయినప్పుడు సోషల్ మీడియాతో అభిమానులతో టచ్లో ఉంటూ వస్తున్నారు జగపతి. తనకు సంబంధించిన పలు విషయాలను, ఫొటోను షేర్ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. లేటెస్ట్గా ఆయన తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తమిళనాడులోని ఓ హైవే పక్కన ధాబాలో తన అసిస్టెంట్తో, డ్రైవర్తో కలిసి భోజనం చేశారు జగ్గూభాయ్. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా అసిస్టెంట్ చిరు, డ్రైవర్ రాజుతో చాలా కాలం తర్వాత హైవే ఫుడ్ ఆరగించాను. ఆసమ్" అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇలా తన దగ్గర పనిచేసేవారితో భోంచేస్తూ ఫొటో దిగడమే కాకుండా, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి, మరోసారి సింప్లిసిటీ చాటుకున్న జగ్గూభాయ్ని నెటిజన్లు తెగ పొగిడేశారు. మీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.