హాస్పిటల్ నుంచి వచ్చాక ముఖం చూపించని సాయితేజ్!
on Oct 21, 2021
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కలుసుకున్నారు. బుధవారం రాత్రి తేజ్ ఇంటికి వెళ్లిన హరీష్ అతడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని హరీష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. హీరో తేజ్ చేతిలో చేతి వేసిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్.. "నా సోదరుడు సాయి ధరమ్ తేజ్ను కలిశాను. ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. తేజ్ సూపర్ ఫిట్గా ఉన్నాడని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఫుల్లీ అండ్ మళ్లీ లోడెడ్..." అని ట్వీట్ చేశారు.
దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో హీరో సాయి ధరమ్ తేజ్ తెరకెక్కిన సినిమా 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తేజ్ నటించిన బెస్ట్ మూవీస్ల్లో ఇది ఒకటిగా నిలిచింది.
సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్లోని ఐకియా సమీపంలో బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో నెల రోజుల చికిత్స అనంతరం క్షేమంగా ఇంటికి వచ్చాడు. వైద్యుల సూచనతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తేజ్ తాజాగా నటించిన చిత్రం 'రిపబ్లిక్'. ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకత్వం వహించారు. తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఈ చిత్రం విడుదలైంది.
అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక సాయితేజ్ ఎలా ఉన్నాడో ఇంతదాకా ముఖం చూపించలేదు. చేతులు మాత్రమే చూపిస్తూ వస్తున్నారు. దీంతో అతని ముఖానికి ఏమైంది? అనే ఆదుర్దా ఫ్యాన్స్లో వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన రోజు సాయితేజ్ కంటి దగ్గర గాయమైనట్లు కనిపించింది. ఆ గాయం ఇంకా తగ్గలేదా? అందుకనే ఇంకా ముఖం చూపించడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
Also Read