బాలకృష్ణ చేతుల మీదుగా 'జెట్టి' ట్రైలర్ విడుదల
on Oct 21, 2021
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'జెట్టి'. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 'జెట్టి' సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన.. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
'జెట్టి' ట్రైలర్.. "నా ఆశ కంటే మా నాన్న ఆశయం గొప్పది సార్" అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది. ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని 'జెట్టి' సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది. సినిమాలో మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా నందిత శ్వేతా రాజీలేని పోరాటం చేస్తుంది. మాన్యం(హీరో మాన్యం కృష్ణ) సహాయంతో విలన్స్ ని హీరోయిన్ ఎలా ఎదుర్కొంది. వీళ్లంతా ఊరికి జెట్టిని తీసుకొచ్చారా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. ( 'జెట్టి' అనగా 'రేవుకి రక్షణ కల్పించటానికి ఒడ్డు నుంచి సముద్రంలోనికి నిర్మించబడిన గోడ')
ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత వేణు మాధవ్ మాట్లాడుతూ.. "మా 'జెట్టి' సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయన ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరి తరుపున బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని 'జెట్టి' సినిమాను నిర్మించాం. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను చక్కగా చిత్రీకరించారు మా దర్శకుడు. త్వరలోనే థియేటర్ లలో 'జెట్టి' సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం" అన్నారు.
మాన్యం కృష్ణ, నందిత శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన 'జెట్టి' సినిమాలో.. కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ షెట్టి తదితరులు నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read