వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?
on Nov 25, 2021
డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమే సమకూర్చారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. గురువారం (నవంబర్ 25) ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు.
అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ టీవీ న్యూస్ రీడర్ చెప్పే వాయిస్ ఓవర్తో ఫస్ట్ గ్లింప్స్ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా... ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం డిపార్ట్మెంట్కు రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 'శేఖర్'గా రాజశేఖర్ను ఇంట్రడ్యూస్ చేశారు. "వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?" అని బ్యాక్గ్రౌండ్లో డైలాగులు వినిపిస్తూ ఉంటే... స్టయిలిష్గా సిగరెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించారు. అతి తక్కువ మేకప్తో ప్రస్తుతం రియల్ లైఫ్లో ఆయన లుక్ ఎలా ఉందో అలాగే తెల్లగా మెరిసిన జుట్టు, తెల్లటి గడ్డం లుక్లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది.
ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. ఇప్పుడు ఫస్ట్ గ్లింప్స్కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జనవరి 2022లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.
రాజశేఖర్, ఆత్మీయ రాజన్, 'జార్జ్ రెడ్డి' ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ళ భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తారాగణమైన ఈ చిత్రానికి కళ: సంపత్, రైటర్: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నారగాని, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జీవితా రాజశేఖర్.