పరుచూరి బ్రదర్స్ రచన చేసిన ఫస్ట్ కామెడీ ఫిల్మ్ ఫ్లాపయ్యింది.. ఆ ఫిల్మ్ ఏదో తెలుసా?
on Jun 19, 2021
పరుచూరి బ్రదర్స్ అంటే మంచి ఎమోషనల్ మాస్ సినిమాలు జ్ఞాపకానికొస్తాయి. ఎమోషనల్ డైలాగ్స్కు వాళ్లు పెట్టింది పేరు. అనేక సినిమాలు ఆ విషయాన్ని రుజువు చేశాయి. అయితే వారు వేళ్లమీద లెక్కించదగ్గ కామెడీ సినిమాలకు కూడా పనిచేశారు. వాటిలో మొట్టమొదటి సినిమా 'డామిట్.. కథ అడ్డం తిరిగింది' (1987). పేరుపొందిన కామెడీ హీరోలు చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, నరేశ్లతో, హాస్య చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తులైన కె. వాసు ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయినప్పటికీ ఆ సినిమా ఫ్లాపయింది.
టైటిల్కు తగ్గట్లు కథ అడ్డం తిరగడం వల్లే ఆ సినిమా ఫ్లాపయ్యిందని తమదైన శైలిలో చెప్పారు పరుచూరి బ్రదర్స్. "కథలో కన్ఫ్యూజన్ ఉండటమే. మూడు పాత్రల్లో చంద్రమోహన్, రెండు పాత్రల్లో రాజేంద్రప్రసాద్ కనపడటంతోనే ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. సినిమా మొదటి కాపీ చూడగానే మాకే సందేహం వచ్చింది. పైగా రాజేంద్రప్రసాద్ రెండు పాత్రలకూ ఒకటే విగ్గు పెట్టాడనీ, ఏ వేషం ఏదో తెలీలేదనీ రామానాయుడు గారన్నారు. ఆ కన్ఫ్యూజన్లో మేం దెబ్బతిన్నాం. అదీ గాక, స్క్రీన్ప్లే పండలేదు. కథ ప్రకారం రౌడీలైన ఇద్దరు కుర్రాళ్లు కామెడీగా కనిపించడం తప్పైంది." అని వారు చెప్పారు.
పరుచూరి బ్రదర్స్ అభ్యదయ రచయితలు, నాటక సమాజాన్నించి వచ్చినవాళ్లు అనే ముద్ర అప్పట్లో బాగా ఉంది. అలా ముద్రలు వేయడం మన సినిమావాళ్లకు బాగా అలవాటని వారికి తెలుసు. "ఆ కారణంగానే కామెడీ కథ వద్దు, శివకృష్ణ 'ఆడపడుచు' లాంటి కథ రాస్తాం అని నిర్మాతకు చెప్పాం. వాళ్లు 'అనసూయమ్మగారి అల్లుడు' రిఫరెన్స్ ఇచ్చి అలాంటి కామెడీ రాయమని పట్టుబట్టారు. నిజానికి 'అనసూయమ్మగారి అల్లుడు' కామెడీ ఫిల్మ్ కాదు. మాస్ మూవీ. ఏమైనా కృషి చెయ్యడం వరకే మా చేతుల్లో ఉంది. జయాపజయాలు మన చేతుల్లో లేవు." అని చెప్పుకొచ్చారు బ్రదర్స్.
Also Read