కణికా కపూర్ అరెస్ట్కు పెరుగుతున్న డిమాండ్!
on Mar 20, 2020
బాధ్యతారహితంగా వ్యవహరించి, వేలాది మంది ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన బాలీవుడ్ సింగర్ కణికా కపూర్ను అరెస్ట్ చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఆమె, ఆ విషయాన్ని దాచిపెట్టి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో బసచేసి, కనీసం వందమంది హాజరైన ఒక పార్టీకి హాజరవడం, ఆ తర్వాత ఆమెకు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ రావడం సంచలనం సృష్టించడంతో పాటు అనేక మంది ప్రముఖుల్ని సైతం ఉలిక్కిపడేలా చేసింది. కారణం.. ఆమె పాల్గొన్న పార్టీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ అయిన దుష్యంత్ సింగ్ కూడా ఉండటం, వసుంధరకు అతి సన్నిహితంగా కణిక మెలగడం. దుష్యంత్ సింగ్ అయితే, ఆ తర్వాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన అల్పాహార విందుకు హాజరవడం మరింత ఆదోళనకరం.
ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కణిక బాధ్యతా రాహిత్యం లక్నో ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచే మొదలైందని సమాచారం. అక్కడి అధికారులతో గొడవకు దిగి, వాష్రూమ్లో దాక్కుని స్క్రీనింగ్ నుంచి ఆమె తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి రికవర్ అయ్యాక యు|ఎస్ 3 ఆఫ్ ఎపెడిమిక్ యాక్ట్ 1897 ప్రకారం కణికపై చర్యలు తీసుకోవాలని చట్టాల గురించి తెలిసినవాళ్లు డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ అయితే కణికది క్రిమినల్ నెగ్లిజెన్స్గా పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వాళ్లు చాలామంది స్వీయ నిర్బంధంలోకి వెళ్తుంటే, అందుకు భిన్నంగా కణిక పార్టీలకు హాజరవుతూ, హోస్ట్గా వ్యవహరిస్తూ వచ్చిందని ఆమె దుయ్యబట్టింది. కణిక నిర్లక్ష్యం అనేకమంది జీవితాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని బర్ఖా దత్ ట్వీట్ చేశారు. హోటళ్లలో అన్ని రకాల పార్టీలను నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు.
గమనించాల్సిన విషయమేమంటే ఆమెకు పరీక్షలు నిర్వహించిన మెడికల్ షీట్లో ఆమె వయసు 28గా పేర్కొన్నారు. నిజానికి ఆమె వయసు 41 ఏళ్లు. అలాగే జెండర్ దగ్గర ఫిమేల్ అని కాకుండా మేల్ అని వేయడం గమనార్హం. అసలు ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ను తప్పించుకోవడం అసాధ్యమైన విషయమైతే, ఆమె ఎలా తప్పించుకున్నదనేది సందేహాలను రేకెత్తిస్తోంది. జనవరి నుంచే ఎయిర్పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులను స్క్రీనింగ్ చేస్తున్నామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించగా, కణికా కపూర్ ఉదంతం దాన్ని పరిహాసం చేసినట్లయింది.