మెగాస్టార్ కి విలన్ గా `అయ్యప్పన్`!
on Jun 26, 2022
మలయాళ చిత్ర సీమలో పాతికేళ్ళకు పైగా నటుడిగా అలరిస్తున్నాడు బిజు మీనన్. తెలుగులో `రణం`, `ఖతర్నాక్` (2006) వంటి సినిమాల్లో సందడి చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. రీసెంట్ గా మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో అయ్యప్పన్ గా మెస్మరైజ్ చేశాడు. ఇదే సినిమాని `భీమ్లా నాయక్` పేరుతో తెలుగులో రీమేక్ చేయగా బిజు పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం బిజు ఓ భారీ బడ్జెట్ తెలుగు మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడట. అది కూడా.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో.
ఆ వివరాల్లోకి వెళితే.. చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `మెగా 154` అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని.. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవికి జంటగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ఓ స్పెషల్ రోల్ లో ఎంటర్టైన్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, ఇదే ప్రాజెక్ట్ కోసం తొలుత విలన్ గా సముద్ర ఖని పేరు వినిపించింది. అయితే, ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ - సాయితేజ్ కాంబినేషన్ లో ఓ సినిమాని డైరెక్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సముద్రఖనికి బదులుగా బిజు మీనన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే `మెగా 154`లో బిజు ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. 16 ఏళ్ళ తరువాత తెలుగులో విలన్ గా నటించనున్న బిజు మీనన్.. మెగాస్టార్ కాంబినేషన్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read