27 వసంతాల 'భైరవద్వీపం' విశేషాలు ఎన్నెన్నో!
on Apr 15, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ అభినయపర్వంలో పలు మరపురాని చిత్రాలు ఉన్నాయి. వాటిలో 'భైరవద్వీపం' ఒకటి. జానపద చిత్రంగా తెరకెక్కిన 'భైరవద్వీపం'.. అప్పట్లో నందమూరి అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించింది. మాయలు, మంత్రాలు, వింత వింత సన్నివేశాలు, వీనుల విందైన పాటలు, కనువిందైన దృశ్యాలు.. వెరసి 'భైరవద్వీపం' అప్పట్లో ఓ బాక్సాఫీస్ వండర్.
విజయ్ పాత్రలో బాలయ్య ఆహార్యం, అభినయం, సాహసాలు, నృత్యాలు.. ఈ సినిమాకి ప్రధానబలంగా నిలవగా - రాజకుమారి పద్మావతి పాత్రలో రోజా తన అందచందాలతో కవ్వించింది. అలాగే మాంత్రికుడు భైరవుడు పాత్రలో విజయ రంగరాజు నటన భయపెడితే.. ఇతర ముఖ్య పాత్రల్లో కె.ఆర్. విజయ, సత్యనారాయణ, విజయ్ కుమార్, బాబూమోహన్, సంగీత, మనోరమ, సుత్తివేలు, గిరిబాబు, శుభలేఖ సుధాకర్ ఆకట్టుకున్నారు. యక్షిణిగా రంభ ప్రత్యేక గీతంలో తన నృత్యాలతో సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.. `భైరవద్వీపం`లోని ప్రతి సన్నివేశాన్ని ఆబాలగోపాలన్ని అలరించేలా తెరకెక్కించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కబీర్ లాల్ ఛాయాగ్రహణం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది. మాధవపెద్ది సురేశ్ స్వరకల్పనలో పాటలన్నీ విశేషాదరణ పొందాయి. "నరుడా ఓ నరుడా", "విరిసినది వసంతగానం", "శ్రీ తుంబుర నారద", "ఎంత ఎంత వింత మోహమో", "ఘాటైన ప్రేమ ఘటన", "అమ్మా శాంభవి".. ఇలా ప్రతీ గీతం ఓ ఆణిముత్యమే. చందమామ విజయ కంబైన్స్ వారి నిర్మాణ విలువలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
అవార్డులు, రివార్డులు, రికార్డులు.. ఇలా ఎన్నింటికో చిరునామాగా నిలిచిన "భైరవద్వీపం".. 1994 ఏప్రిల్ 14న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ జానపద చిత్రరాజం 27 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read