రెండోసారి కరోనా పాజిటివ్.. ఐసీయూలో బండ్ల గణేశ్!
on Apr 13, 2021
హాస్యనటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ రెండోసారి పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. తొలిసారి వైరస్ సోకిన దానితో పోలిస్తే ఈసారి ఆయన తీవ్ర నిస్సత్తువకు గురయ్యాడనీ, ఆయనను ఐసీయూలో చేర్పించారనీ తెలుస్తోంది. లాక్డౌన్ టైమ్లో టాలీవుడ్లో కొవిడ్-19కు గురైన తొలినాటి సెలబ్రిటీల్లో ఒకరిగా గణేశ్ వార్తల్లో నిలిచాడు. పాజిటివ్గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజులకే నెగటివ్గా తేలి, ఆ వైరస్ బారి నుంచి బయటపడ్డాడు. దేవుని దయవల్ల తను త్వరగా కరోనా నుంచి బయటపడ్డానని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అప్పట్లో ఆయన వెల్లడించాడు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఫస్ట్ వేవ్తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్లో దేశవ్యాప్తంగా అనేకమంది సినీ సెలబ్రిటీలు దాని బారిన పడుతున్నారు. కొంతమంది తమ ఇళ్లల్లోనే ఐసోలేషన్కు వెళ్లి డాక్టర్ల సలహాల ప్రకారం మెడికేషన్ తీసుకుంటూ దాని నుంచి బయటపడుతుంటే, కొంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు.
ఇప్పుడు రెండోసారి కొవిడ్-19కు గురైన బండ్ల గణేశ్ జ్వరంతో పాటు మరికొన్ని కొవిడ్ లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడనీ, దాంతో కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అయితే గణేశ్ కుటుంబసభ్యులు కానీ, హాస్పిటల్ వర్గాలు కానీ ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.
ఇటీవలే తన ఆరాధ్య నటుడు పవన్ కల్యాణ్ ఫిల్మ్ 'వకీల్ సాబ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొని గణేశ్ చేసిన ప్రసంగం వైరల్ అయింది.