నువ్వూ ఒకరోజు నన్ను చూసి కాలర్ ఎగరేయాలి నాన్నా!
on Oct 23, 2021
తండ్రి పూరి జగన్నాథ్ అంటే తనకెంత ఇష్టమో, ఎంత పిచ్చో చెప్పాడు ఆకాశ్ పూరి. అతను హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీకి పూరి స్టోరీ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాశాడు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 29న ఆడియెన్స్ ముందుకు వస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆకాశ్ స్పీచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మధ్య కాలంలో ఏ హీరో స్టేజిపై ఇంత బాగా, ఇంత ఎమోషనల్గా మాట్లాడలేదని చెప్పుకుంటున్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి తాను ఏవో మాటలు విన్నాననీ, నాన్నను ఎవరైనా అంటే చిన్నప్పుడు తనకు చాలా కోపం వచ్చేదనీ చెప్పాడు. "ఏదైనా బ్యాడ్ కామెంట్ చదివినా, వాడి ఇంటికి వెళ్లి వాడి తలపగలగొడతామని అనిపించేది. ఆ రేంజ్లో కోపం వచ్చేది. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వింటే చాలా బాధనిపించేది. 'పూరి టైమ్ అయిపోయింది.. ఇంక సినిమాలేం తీస్తాడు.. రొటీన్ సినిమాలు'.. అంటూ అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చేవి. కానీ నాన్నా.. మొన్న ఇస్మార్ట్కు నువ్విచ్చిన 'హై'.. దీనెమ్మ అలాంటి ఇలాంటి హై కాదు.. ఇప్పుడు చెప్తున్నా.. నీ కెరీర్ అయిపోయింది, నీ వల్ల ఏం కాదు అన్న ప్రతివాళ్లకు ఇప్పుడు నేను చెప్తున్నా.. 'దీనెబ్బ కొట్టాడ్రా మావాడు'.. నాన్నా.. థియేటర్లో జనాలు నీ డైలాగ్స్కు ఎగురుతుంటే.. కాలర్ ఎగరేశా నాన్నా నేను. నాకా మూమెంట్ ఇచ్చినందుకు థాంక్యూ." అన్నాడు ఆకాశ్.
"నువ్వు నన్నెంతో ఇన్స్పైర్ చేశావ్ నాన్నా. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా అనుకొని చెయ్యమన్నావ్. ప్రతి సినిమా లాస్ట్ సినిమా అయితే ఎలా చేస్తానో అలా కష్టపడతాను. నువ్వూ ఒకరోజు నన్ను చూసి కాలర్ ఎగరేయాలి నాన్నా. అది నా గోల్. దానికోసం కష్టపడతాను. నాకు ఏ టైమ్లో బ్రేక్ వస్తుందో తెలీదు నాన్నా. ఎన్నేళ్లయినా సరే.. నేను కొట్టాల.. నువ్వు కాలర్ ఎగరెయ్యాల." అని చెప్పాడు ఆకాశ్.
Also Read