ఐశ్వర్యా రాయ్ సినీ ప్రస్థానానికి పాతికేళ్ళు!
on Jan 13, 2022
ఐశ్వర్యా రాయ్.. అందానికి ఐకాన్. 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఐశ్వర్య.. ఆపై లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన తమిళ చిత్రం `ఇరువర్`తో అభినయపర్వానికి శ్రీకారం చుట్టింది. 1997 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఎపిక్ పొలిటికల్ డ్రామాలో పుష్పవల్లి, కల్పనగా రెండు విభిన్న పాత్రల్లో దర్శనమిచ్చింది ఐశ్వర్య. రాజకీయ ప్రత్యర్ధులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా `ఇరువర్` తెరకెక్కగా.. తెలుగులో ఈ సినిమా `ఇద్దరు` పేరుతో అనువాదమైంది.
ఎంజీ రామచంద్రన్, ఎం. కరుణానిధి, జయలలిత వంటి రాజకీయ ప్రముఖుల స్ఫూర్తితో ఈ సినిమాని తెరకెక్కించారు మణిరత్నం. ఎంజీఆర్ తరహా పాత్రలో మోహన్ లాల్, కరుణానిధి తరహా పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించగా.. ఐశ్వర్య పోషించిన రెండు పాత్రల్లో ఒకటి జయలలిత స్ఫూర్తితో రూపొందడం విశేషం. రేవతి, గౌతమి, టబు, నాజర్ ఇతర ముఖ్య వేషాల్లో కనిపించిన ఈ చిత్రంలో మధు బాల ఓ పాటలో అభినయించింది. స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. `ఉత్తమ సహాయ నటుడు` (ప్రకాశ్ రాజ్), `ఉత్తమ ఛాయాగ్రాహకుడు` (సంతోష్ శివన్).. ఇలా రెండు విభాగాల్లో ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది.
మొత్తంగా.. క్లాసిక్ గా నిలిచిన సినిమాతో నాయికగా తొలి అడుగేసిన ఐశ్వర్య ఆనక హిందీనాట స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. తెలుగులోనూ `రావోయి చందమామ` (1999) కోసం ఓ ప్రత్యేక గీతంలో తన చిందులతో కనువిందు చేసింది. ప్రస్తుతం తన తొలి చిత్ర దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న `పొన్నియన్ సెల్వన్`లో చాలా కాలం తరువాత ద్విపాత్రాభినయం చేస్తున్న ఐశ్వర్యా రాయ్.. ఈ శుక్రవారంతో పాతికేళ్ళ సినీ ప్రస్థానం పూర్తిచేసుకుంటోంది.
Also Read