రవితేజతో కళ్యాణి ప్రియదర్శన్ రొమాన్స్!
on Jan 13, 2022
అక్కినేని బుల్లోడు అఖిల్ హీరోగా నటించిన `హలో` (2017) చిత్రంతో కథానాయికగా తొలి అడుగేసింది కళ్యాణి ప్రియదర్శన్. దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ గారాలపట్టి అయిన ఈ కేరళకుట్టి.. మొదటి ప్రయత్నంలో ఆశించిన విజయం అందుకోలేకపోయినా.. ఆపై `చిత్రలహరి`, `రణరంగం` (2019) సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. వీటిలో `చిత్రలహరి` ఓకే అనిపించుకుంది. కాగా, `రణరంగం` తరువాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించని కళ్యాణి.. త్వరలో ఓ స్టార్ హీరో సినిమాతో మరోసారి టాలీవుడ్ లో సందడి చేయనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. శింబుతో కళ్యాణి కలిసి నటించిన టైమ్ లూప్ థ్రిల్లర్ `మానాడు` తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ ని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. కాగా, ఈ రీమేక్ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తాడని.. అతనికి జంటగా మాతృక నాయిక అయిన కళ్యాణినే నటించే అవకాశముందని లేటెస్ట్ బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ చేతిలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు ఉన్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాలోనూ రవితేజ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి.