ENGLISH | TELUGU  

అడివి శేష్ హీరోల గురించి చెప్పాడు మరి హీరోయిన్ల సంగతేంటి!

on Dec 28, 2022

తాజాగా అడివి శేష్ టాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలలో మెయిన్ లీడ్ రోల్స్‌కి  ఆడిషన్స్ జరగవని, హీరో పాత్రలకు అసలు ఉండవని, ఏదో చిన్న చిన్న పాత్రలకు మాత్రం ఆడిషన్స్ చేస్తారని వ్యాఖ్యానించారు. మెయిన్ హీరో, లీడ్‌రోల్స్ అన్నింటిని ముందుగానే సినీ వారసులకు కేటాయిస్తారని, మిగిలినవన్నీ చిన్న చిత‌కా పాత్ర‌ల‌కు ఆడిష‌న్స్ జ‌రుగుతాయ‌ని  ఆయన చెప్పుకొచ్చారు.  టాలీవుడ్లో ఒక్కో ఫ్యామిలీలో డజన్ మంది హీరోలు ఉన్నారని ఇక్కడ బంధుప్రీతి ఎక్కువ అని తేల్చిచెప్పారు. ఇంతవరకు ఓకే. అడివి శేష్ చెప్పింది టాలీవుడ్ లో నిజమే అనుకున్నప్పటికీ తాజాగా ఓ సంఘటన చూస్తే బాలీవుడ్ కూడా దీనికి ఏమీ అతీతం కాదు అనిపిస్తుంది.

వాస్తవంగా అడివి శేష్ టాలీవుడ్ పై వివాదాస్పద వ్యాఖ్యలను బాలీవుడ్ వెబ్ పోర్ట‌ల్‌కు ఇచ్చారు.  అంటే తెలుగులో ఆడిషన్స్ ఉండవు గాని బాలీవుడ్ లో అలా కాదు అనుకున్నాడు కాబట్టే ఆయన బాలీవుడ్ మీడియాలో  మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇక విషయానికి వస్తే సుకుమార్ శిష్యుడు కొత్త దర్శకుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ తేజ్‌ హీరోగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో కృతి శెట్టిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ఉప్పెన. ఈ మూవీ అద్భుత విజయం సాధించింది. ఏకంగా 100 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఓవర్ నైట్ కృతిశెట్టి మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్ అయిపోయింది. 

మొదటి మూడు చిత్రాలైనా వైష్ణవ తేజ్- బుచ్చిబాబు ల ఉప్పెన, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నేచుర‌ల్ స్టార్  నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ ఆ తర్వాత వచ్చిన నాగార్జున-నాగ‌చైత‌న్య‌ల బంగార్రాజు చిత్రాలు బాగా ఆడాయి. బంగార్రాజులో నాగార్జునకు జోడిగా రమ్యకృష్ణ నటించిన నాగచైతన్య సరసన కృతి శెట్టి అలరించింది ఇలా  మొదటి మూడు సినిమాలు హిట్ కావ‌డంతో హ్యాట్రిక్ హిట్స్ హీరోయిన్ అయిపోయింది. అయినప్పటికీ ఆ తరువాత మాత్రం ఆమెకు వరుసగా హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు పలకరించాయి. రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్, నితిన్ హీరోగా ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మాచర్ల నియోజకవర్గం, అభిరుచి కలిగిన దర్శకునిగా, హీరోయిన్లను చాలా బాగా చూపిస్తాడని పేరు ఉన్న ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

వాస్తవానికి కృతిశెట్టి మొదటి చిత్రం ఓ హిందీ చిత్రం. దాని పేరు సూపర్ 30. మర‌లా  ఇంతకాలం తర్వాత ఆమె ఓ హిందీ సినిమా ఒప్పుకుంది. బాలీవుడ్ లో ఇంతకుముందు అంధాదున్‌ వంటి సూపర్ హిట్ మూవీ తీసిన శ్రీ‌రామ్  రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి అడ్వాన్స్ కూడా తీసేసుకుంది. షూటింగ్‌కి ముందు కాస్త ఆడిషన్స్ లో పాల్గొనాల్సిందిగా డైరెక్టర్ ఆమెకు కబురు పంపారు.  అంతే మన హీరోయిన్ గారికి ఈగో హర్ట్ అయింది. కొత్త హీరోయిన్ లాగా నాకేంటి ఆడిషన్స్... నేను ఆడిషన్స్‌కు రాను. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాను... ఈ సినిమా నాకు అవసరం లేదు... అని డైరెక్టర్ మొహం మీదనే చెప్పేసి తీసుకున్న అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేసిందట. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి తీసుకుంటే ఒకనాడు ఎన్టీఆర్, ఏఎన్నార్,సావిత్రి, అంజలీదేవి నుంచి నిన్న మొన్నటి వరకు శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి వారు కూడా ఆడిషన్స్ కు హాజరయ్యేవారు. కాకపోతే వాటిని మనం స్క్రీన్ టెస్ట్ లు గా పిలుచుకునేవారం.  

కానీ ఈమె  మాత్రం మూడు హిట్ల‌కే  మున‌గ  చెట్టు ఎక్కి కూర్చుంది. అయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈమెకు అంత ఇగో సరికాదని... హిందీలో ఇప్పటికీ ఎందరో టాప్ హీరోయిన్లు కూడా స్క్రీన్ టెస్ట్ చేయించుకుంటారు అన్న విషయం అమ్మడు ఎంత త్వరగా గుర్తిస్తే  అంత మంచిది.  లేకపోతే మున్ముందు ఆమెకు కెరీర్‌పరంగా తిప్పలు వచ్చి అసలు చేతిలో సినిమాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదు. కాబట్టి కాస్త ఇగో ను తగ్గించుకొని వినయంగా డైరెక్టర్లు చెప్పినట్టు చేయడం చాలా ముఖ్యం అనే విషయాన్ని ఈ యంగ్ బ్యూటీ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత మంచిద‌ని బాలీవుడ్ సినీ విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.