'విరాట పర్వం'.. తూము సరళ ప్రేమ కథ నిజమేనా?
on Jun 17, 2022
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'విరాట పర్వం'. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. 1990లలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సాయి పల్లవి పోషించిన పల్లవి అనే ప్రధాన పాత్రను.. 16 ఏళ్లకే నక్సల్స్ చేతిలో హతమైన తూము సరళ అనే యువతి జీవితం ఆధారంగా రాసుకున్నారు. దీంతో అసలు ఈ తూము సరళ ఎవరు అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వామపక్ష భావజాలమున్న తన తండ్రి కారణంగా సరళలో చిన్న వయస్సులోనే విప్లవ భావాలు పురుడు పోసుకున్నాయట. చిన్నతనం నుంచే గుండె ధైర్యం గల సరళ.. తుపాకీ పడతా, ఉద్యమంలోకి వెళ్లి జనం కోసం పని చేస్తానని ఫ్రెండ్స్ తో చెప్పేదట. చిన్న వయస్సులోనే ఉద్యమానికి ఆకర్షితురాలైన ఆమె ఖమ్మంలో ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దళంలో చేరాలని వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియక కుటుంబసభ్యులు ఆందోళన పడుతుండగా.. నెల రోజుల తర్వాత ఆమెని నక్సలైట్స్ చంపేశారన్న వార్త తెలిసి షాక్ అయ్యారు. వెతుక్కుంటూ వచ్చి దళంలో చేరిన సరళను.. అనుమానించి, పోలీస్ ఇన్ఫార్మర్ అని భావించి నక్సల్స్ దారుణంగా చంపేశారు. ఆ తర్వాత పొరపాటున చంపేశామని తెలుసుకున్నారు. ఇదే వేణు ఊడుగులను కదిలించింది. 'విరాట పర్వం'కి నాంది పడేలా చేసింది.
నిజానికి సరళ ఉద్యమాన్ని ప్రేమించి అడవి బాట పట్టి కన్నుమూసింది. అయితే వేణు ఆమె ఘటన నుంచి స్ఫూర్తి పొంది, దానికి ప్రేమ కథని జోడించి.. నెత్తుటి చుక్కలతో ప్రేమ కావ్యాన్ని రచించాడు. వెండితెరపై విప్లవ ప్రణయాన్ని చూపించాడు.