సినిమా కంటే ముందు షో చేస్తాడట!
on Apr 25, 2020
వక్కంతం వంశీ టాలెంటెడ్ రైటర్. మాస్ మహారాజ్ రవితేజకు 'కిక్', యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి 'టెంపర్', స్టైలిష్ స్టార్ బన్నీకి 'రేసుగుర్రం', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి 'ఎవడు' ఇలాంటి విజయాలు అందించిన రచయిత వక్కంతం. అయితే అతడు దర్శకుడుగా పరిచయమైన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఆశించిన స్థాయిలో ఆడలేదు దాంతో ఇతరులతో పోలిస్తే రేసులో కాస్త వెనుకబడ్డారు. అలాగని హీరోలు అతని పక్కన పెట్టలేదు. మాస్ మహారాజ్ రవితేజ మరోసారి వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చారు. ఇంతకు ముందే రచయితగా అవకాశం ఇస్తే ఈ సారి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
రవితేజ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ముందుగా అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం రన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రవితేజ క్రాక్ చేస్తున్నారు. ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు. ఇది పూర్తయ్యే వక్కంతం వంశీ సెట్స్ మీదకు వచ్చే సరికి కాస్త సమయం పడుతుంది. అందుకని, ఈ లోపు ఓ వెబ్ షో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
"రవితేజ తనకున్న కమిట్మెంట్స్ పూర్తిచేసుకుని... మా కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ చేయడానికి సమయం పడుతుంది. దసరా వరకు థియేటర్లు ఓపెన్ కాకపోవచ్చని అనిపిస్తుంది. ఈ లోపు సమయం వృధా చేయడం కంటే... డిజిటల్ మీడియం కోసం ఒక షో చేసే ఆలోచనలో ఉన్నాను. భవిష్యత్ ఓటీటీలదే అంటున్నారు. నేను ఒక షో చేస్తే 30 40 మందికి పని దొరుకుతుంది. నా సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఫినిష్ చేయవచ్చు. గత 20 నెలలో చాలా ఐడియాలు రాశాను. ఇందులో కొన్ని ఓటీటీకి పనికి వస్తాయి" అని వక్కంతం వంశీ అన్నారు. ప్రస్తుతం ఆయనకు కొత్త కథలు రాసే సమయం దొరకడం లేదట. లాక్ డౌన్ వల్ల ఇంటికి పరిమితం కావడంతో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పారు.