మూడు వారాలకే ఓటీటీలోకి చైతన్య 'థాంక్యూ'
on Aug 9, 2022
నాగ చైతన్య ఎంతో నమ్మకం పెట్టుకున్న 'థాంక్యూ' మూవీ జులై 22న విడుదలై ఘోర పరాజయం పాలైంది. 'మనం' వంటి క్లాసిక్ హిట్ తర్వాత డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, చైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కనీసం రూ.5 కోట్ల షేర్ కూడా రాబట్టలేక చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా మూడు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 11 నుంచి 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. కలెక్షన్స్ పరంగా డిజాస్టర్ గా నిలిచిన 'థాంక్యూ..' టాక్ పరంగా మాత్రం పర్లేదని అనిపించుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీలోనైనా ఆకట్టుకుంటుందేమోనని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇటీవల బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలిన 'విరాట పర్వం', 'అంటే సుందరానికీ' సినిమాలు ఓటీటీలో విశేష ఆదరణ పొందాయి. మరి 'థాంక్యూ' విషయంలోనూ అదే రిపీట్ అవుతుందేమో చూడాలి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా.. మాళవిక నాయర్, అవికా గోర్, సుశాంత్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.