'రాధే శ్యామ్' ట్రైలర్.. మరో 'టైటానిక్' అవుతుందా?
on Dec 23, 2021

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. నేడు(గురువారం) హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ ఫ్యాన్స్ సాక్షిగా విడుదల చేశారు.
రాధేశ్యామ్ మూవీ ఒక లవ్ స్టోరీ ముందు నుండి మూవీ టీమ్ చెబుతూ వచ్చింది. రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాసు పార్వతి లాగా రాధే శ్యామ్ కూడా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తుంటే ఇదొక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని అర్థమవుతుంది. ఇందులో ప్రభాస్, పూజల మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది.
'రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు' అంటూ ప్రభాస్ వాయిస్ తో ట్రైలర్ ప్రారంభమైంది. తాను రోమియోని కాదని, తాను ప్రేమలో పడనని ప్రభాస్ మొదట్లో అంటాడు. 'నేను జూలియట్ నే.. నాతో ప్రేమలో పడితే చస్తావ్' అని పూజ అంటుంది. పడను పడను అంటూనే పూజ ప్రేమలో ప్రభాస్ పడినట్లుగా ట్రైలర్ లో చూపించారు. 'నీ ప్రేమ ఎదురవ్వడం వరం.. కానీ దానిని అందుకోవడం మాత్రం ఒక యుద్ధం' అని ప్రభాస్ అనగానే ఒక షిప్ సముద్రంలో మునిగిపోతున్న విజువల్స్ కనిపించాయి. 'విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా. మన ప్రేమే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా. ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా. ఐ లవ్ యూ' అంటూ ప్రభాస్ వాయిస్ వస్తుండగా శాడ్ విజువల్స్ చూపించారు. పూజ, ప్రభాస్ బాధపడుతూ కనిపించారు. చివరిలో ప్రభాస్ నెత్తుటి చేతితో గోడని తాకుతూ ఐ లవ్ యూ అని చెప్పడం కనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ లో డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి.
లవ్ స్టోరీ, విజువల్స్ పరంగా అక్కడక్కడా టైటానిక్ సినిమాని గుర్తు చేస్తున్న రాధేశ్యామ్.. ఆ స్థాయిలో అలరించి ఇండియన్ టైటానిక్ గా పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



