నారప్ప ఓటీటీ విడుదలపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు!
on Jul 28, 2021
కరోనా ప్రభావంతో థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. పెద్ద హీరోల సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. రీసెంట్ గా వెంకటేష్ నటించిన 'నారప్ప' డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఇలా ఓటీటీలలో విడుదల చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. తాజాగా పీపూల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కూడా సినిమాలను నేరుగా ఓటీటీలలో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ ఐలాపూరంలో రైతు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశానికి నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన నారప్ప సినిమాను తెలుగు రాష్ట్రాలలో కేవలం 25 శాతం మంది మాత్రమే చూసారని.. మిగతా 75 శాతం మంది చూడలేకపోయారని అన్నారు. పేద, మధ్య తరగతి ఇళ్ళల్లో ఓటీటీ లేదు.. మరి వినోదాన్ని వాళ్లకెప్పుడు అందిస్తారని ప్రశ్నించారు. థియేటర్లో సినిమా చూడడం ఒక పండుగ. సినిమా బతకాలి.. థియేటర్స్ బతకాలి. థియేటర్ లేకపోతే స్టార్ డమ్ లు ఉండవు. పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓటీటీలలో విడుదల చేయకుండా థియేటర్లలో రిలీజ్ అయ్యేటట్టు చూడాలని నారాయణ మూర్తి కోరారు.
ప్రస్తుతం నారాయణ మూర్తి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై సినీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read