'సైమా' అవార్డ్స్ లోనూ 'పుష్ప'దే హవా.. ఆ వెనకే 'అఖండ'!
on Aug 17, 2022
మహమ్మారి దెబ్బకి గతేడాది పలు భాషలకు చెందిన సినీ పరిశ్రమలు డీలా పడిపోతే.. టాలీవుడ్ మాత్రం 2021 లోనూ పలు భారీ విజయాలను అందుకుంది. 2021 ప్రథమార్థంలో ఫిబ్రవరిలో 'ఉప్పెన', మార్చిలో 'జాతిరత్నాలు' విడుదలై చిన్న సినిమాలుగా వచ్చి చాలా పెద్ద విజయాలను అందుకున్నాయి. ఇక డిసెంబర్ లో వచ్చిన 'అఖండ', 'పుష్ప: ది రైజ్' సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించి టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2021 లో ఘన విజయాన్ని అందుకున్న ఈ నాలుగు సినిమాలు.. అవార్డుల్లోనూ అదే జోరు చూపిస్తున్నాయి.
పదో 'సైమా' అవార్డు వేడుకలు సెప్టెంబర్ రెండో వారంలో ఘనంగా జరగనున్నాయి. 2021కి గాను అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన తెలుగు సినిమాల్లో 'పుష్ప', 'అఖండ', 'జాతిరత్నాలు', 'ఉప్పెన' టాప్ లో నిలిచాయి. ఏకంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యి 'పుష్ప' మొదటి స్థానంలో నిలవగా.. 'అఖండ'(10), 'జాతిరత్నాలు'(8), 'ఉప్పెన'(8) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. మరి అవార్డుల విషయంలో వీటిల్లో ఏ సినిమా టాప్ లో నిలుస్తుందో చూడాలి.
తమిళ్, కన్నడ, మలయాళ భాషల సినిమాలతో పోల్చినా కూడా అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన సినిమా 'పుష్ప'నే కావడం విశేషం. తమిళ్ నుంచి 'కర్ణన్'(10), మలయాళం నుంచి 'మిన్నల్ మురళి'(10), కన్నడ నుంచి 'రాబర్ట్'(10) అత్యధిక విభాగాల్లో నామినేట్ అయిన సినిమాలుగా నిలిచాయి.
Also Read