ఇండియన్ సినిమాని మార్చే ఫిల్మ్ 'ప్రాజెక్ట్ k'!
on Aug 4, 2022
ప్రస్తుతం ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో 'ప్రాజెక్ట్ k' ఒకటి. ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్.. సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తున్నాయి. ఈ మూవీ ఇండియన్ అవెంజర్స్ లాంటిదని, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇటీవల చెప్పిన నిర్మాత అశ్వినీదత్ 'ప్రాజెక్ట్ k'పై అంచనాలను అమాంతం పెంచేశారు. ఇక తాజాగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ అయితే 'ప్రాజెక్ట్-k ఇండియన్ సినిమాకి పూర్తిగా మార్చేస్తుంది" అని చెప్పి సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.
దుల్కర్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మించిన చిత్రం 'సీతా రామం' ఆగస్టు 5 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. ప్రభాస్, డైరెక్టర్ నాగ అశ్విన్, అశ్వినీదత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ k' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "అదృష్టం కొద్దీ నేను ప్రాజెక్ట్-k గ్లింప్స్ చూశాను. ఇది భారతీయ సినిమాని పూర్తిగా మార్చబోతుందని చెప్పగలను. చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ చిత్రం. నాగ్ అశ్విన్ లా ఎవరూ ఆలోచించరేమో అనిపిస్తుంది. నాగ్ అశ్విన్ లాంటి దర్శకులకు ఇంత పెద్ద కలలు కనే స్వేచ్చ ప్రభాస్ గారు మాత్రమే ఇవ్వగలరు." అంటూ దుల్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి.