మొదటి భాగంలో ఎన్టీఆర్.. రెండో భాగంలో ధనుష్!
on Feb 6, 2023
జాతీయ అవార్డు గ్రహీత, కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీ దాదాపు ఖరారైనట్లేనని, త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.
ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో, 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇక 32వ సినిమాని వెట్రిమారన్ దర్శకత్వంలో చేయనున్నాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్లు తెలుస్తోంది. 'ఎన్టీఆర్ 31'ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానరే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా నిర్మించనుందని సమాచారం. అంతేకాదు ఇది రెండు భాగాలుగా తెరకెక్కనుందట. మొదటి భాగంలో ఎన్టీఆర్, రెండో భాగంలో ధనుష్ నటించనున్నారని టాక్.
'పొల్లాదావన్', 'ఆడుకాలమ్', 'విసారణై', 'వడచెన్నై', 'అసురన్' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్.. పలు జాతీయ అవార్డులను సైతం అందుకున్నాడు. పదిహేనేళ్ల కెరీర్ లో దర్శకుడిగా చేసింది ఐదు సినిమాలే అయినప్పటికీ.. జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'విడుతలై', సూర్యతో 'వాడివాసల్' సినిమాలు చేస్తున్న ఆయన.. ఆ తర్వాత తారక్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వెట్రిమారన్ కంటెంట్ కి ఎన్టీఆర్ నటన తోడైతే సినిమా మరోస్థాయికి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే జాతీయ అవార్డులు రావడం ఖాయమనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే వీరి కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. మరి వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.