మహేష్ బాబు మిస్సవ్వడం మంచిదయ్యిందా??
on May 16, 2017
మహేష్ బాబు కేవలం నాలుగేళ్లకే 'నీడ' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 1975లో పుట్టిన మహేష్ బాబు.. 79లో విడుదలైన 'నీడ' చిత్రంలో నటించాడు. ఆ తర్వాత మరో నాలుగేళ్లకు నటుడిగా తన 'పోరాటం' ప్రారంభించాడు. 'పోరాటం' చిత్రం 1983లో విడుదలయ్యింది. ఇక అప్పటినుంచి బాలనటుడిగా.. టీనేజ్ హీరోగా సినిమాలు చేస్తూనే వచ్చాడు. తన తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబులతో మహేష్ పలు సినిమాలు చేశాడు. 'శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి-117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు' వంటి చిత్రాల్లో నటించి.. అన్నను మించిన తమ్ముడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించుకున్నాడు.
ఇప్పుడైతే.. తండ్రిని కూడా మించిపోయాడనుకోండి. టీనేజ్ హీరోగా మహేష్ బాబు నటించిన 'బాలచంద్రుడు, అన్నాతమ్ముడు' చిత్రాలు 1990లో రిలీజయ్యాయి. నాలుగేళ్లకే సినీ రంగ ప్రవేశం చేసి.. చిచ్చర పిడుగు అనిపించుకున్న మహేష్ బాబు.. సరిగ్గా 9 ఏళ్ళ విరామం తీసుకొని.. 1999లో కానీ హీరోగా పరిచయమవ్వకపోవడం గమనార్హం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొంది 1999లో విడుదలైన 'రాజకుమారుడు' తో హీరోగా పరిచయమయ్యేనాటికి మహేష్ బాబు వయసు పాతికేళ్ళు. అయితే.. 1994లో విడుదలై.. అప్పటికి చిన్నా చితకా కామెడీ రోల్స్ వేసుకుంటున్న అలీ కెరీర్ ని సమూలంగా మార్చేసిన 'యమలీల' సినిమా కోసం ముందుగా మహేష్ బాబును అనుకున్నారంట. అందుకోసం ఆ చిత్ర దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. ప్రత్యేకంగా కృష్ణగారిని కూడా కలిశారంట. అప్పటికి దర్శకుడిగా కృష్ణారెడ్డి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరస హిట్స్ ఇస్తున్నారు. అయితే.. మహేష్ ను అప్పుడే హీరోగా పరిచయం చేసే ఉద్దేశ్యం లేదని కృష్ణ సున్నితంగా తిరస్కరించారంట. ఒకవేళ మహేష్ బాబు కోసం కృష్ణగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే.. హీరో క్యారెక్టరైజేషన్ ఇంకోరకంగా మార్చి ఉండేవారు. ఆవిధంగా.. కృష్ణ కాదని అన్నందుకు.. 'ఖైదీ' సినిమా చిరంజీవికి వెళ్లినట్లు.. 'కలియుగ పాండవులు'తో వెంకటేష్ హీరో అయినట్లు.. హీరో కృష్ణ తన కుమారుడు మహేష్ బాబుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్ల.. 'యమలీల'తో ఆలీ జాతకమే మారిపోయింది. అయితే.. ఆ చిత్రం మిస్సవ్వడం మంచిదైందని.. లేకపోతే మహేష్ బాబుకు మరోరకమైన ఇమేజ్ వచ్చి ఉండేదని అభిప్రాయపడేవాళ్లు కూడా ఉన్నారు !!