జాతీయ అవార్డులు అందుకున్న 'జెర్సీ' టీమ్!
on Oct 25, 2021
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'జెర్సీ'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా 2019 లో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాకుండా ఈ మూవీ రెండు జాతీయ అవార్డులను సైతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ టీమ్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను అందుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాలలో జెర్సీ మూవీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. సోమవారం 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను అందజేశారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, ఎడిటర్ నవీన్ నూలి.. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సితార ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నాని షేర్ చేశారు.
'జెర్సీ'లో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
Also Read