అమ్మపై కమల్ వివాదస్పద ట్వీట్
on Dec 7, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. జాతీయనేతలు, అన్ని రాష్ట్రాల సినీ , రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆఖరికి జయ బద్ధ శత్రువు డీఎంకే అధినేత కరుణానిధి సైతం అమ్మకు సానుభూతి ప్రకటించారు. కరుణ తనయుడు స్టాలిన్ స్వయంగా జయ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అక్కడకు రాలేని వారు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.
అయితే విలక్షణ నటుడు కమల్హాసన్ చేసిన ట్వీట్ మాత్రం వివాదాస్పదమైంది. "జయ మరణం పట్ల చింతించేవాళ్లకు, ఆమె మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లకు తన ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేశారు కమల్". ఈ వ్యాఖ్యలపై అమ్మ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కమల్ లాంటి గొప్ప నటుడికి ఇలాంటి వ్యాఖ్యలు తగదని చెబుతున్నారు. గతంలో కమల్హాసన్ని జయలలిత ముప్పుతిప్పలు పెట్టింది. ఆయన అన్న ఒక మాటకు ప్రతీగా..ఆయన ఇంటికి కరెంట్ కట్ చేయడం..ఆయన నటించిన ఓ సినిమా విడుదలకు ఆటంకాలు సృష్టించడం చేసింది జయ ప్రభుత్వం. అందుకే కమల్ ఈ రేంజ్లో ట్వీట్లు చేసి ఉంటారని కోలీవుడ్ టాక్.
"I feel for the people those who are dependent on her. Deep condolences to those concerned."
-kamal hassan